ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మమ్మల్ని కవ్విస్తే.. మీకు వినాశనమే: అమెరికా, దక్షిణ కొరియాలకు కిమ్ వార్నింగ్

international |  Suryaa Desk  | Published : Mon, Jan 01, 2024, 09:21 PM

దక్షిణ కొరియా, దాని మిత్రదేశం అమెరికాతో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని సైన్యానికి ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పిలుపునిచ్చారు. ఇకపై పొరుగు దేశంతో ఎటువంటి సయోధ్య, పునరేకీకరణ ప్రయత్నాలు ఉండబోవని ఉద్ఘాటించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దారుణంగా పతనమయ్యాయని, శత్రుదేశాల మాదిరిగా మారాయని కిమ్ వ్యాఖ్యానించినట్టు ఉత్తర కొరియా అధికారిక మీడియా కేసీఎన్‌ఏ వెల్లడించింది. ముఖ్యంగా అమెరికా రూపంలో వచ్చే ముప్పును పసిగట్టి ఉండాలని సైన్యాలకు ఆయన సూచించారు. ఒకవేళ యుద్ధానికి దిగితే వాటిని నాశనం చేయడానికి సిద్ధం కావాలని అన్నారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని సైనిక కమాండర్లతో నిర్వహించిన సమావేశంలో కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడుతూ.. ‘వాస్తవాన్ని గుర్తించి దక్షిణ కొరియాతో మన సంబంధాలపై స్పష్టతనివ్వాల్సిన సమయం వచ్చింది. ఒక వేళ అమెరికా, ద.కొరియాలు యుద్ధానికి ప్రయత్నిస్తే.. మన దగ్గర ఉన్న అణ్వాయుధాలను కూడా వినియోగానికి వెనుకాడబోం. మనల్ని ప్రధాన శత్రువుగా ప్రకటించి.. మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవకాశం కోసం చూస్తున్న వారితో ఎటువంటి సంబంధాలు కొనసాగించం’ అని స్పష్టం చేశారు.


2024 విధాన ఎజెండాను నిర్ణయించడానికి నిర్వహించిన ఈ సమావేశంలో ఉత్తర కొరియా అధినేత.. అమెరికా వివిధ మార్గాల్లో ముప్పును కలిగిస్తోందరని ఆరోపించారు. సాయుధ పోరాటాన్ని ప్రస్తావిస్తూ.. అనుకోని సంఘటన సంభవించినప్పుడు అణు బలగాలతో సహా. అన్ని భౌతిక మార్గాలను సమీకరించే దక్షిణ కొరియా మొత్తం భూభాగాన్ని అణచివేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సోమవారం మాట్లాడుతూ.. ప్యాంగ్‌యాంగ్ కవ్వింపులను కట్టడి చేయడానికి 2024 మొదటి అర్ధభాగంలో అమెరికాతో కలిసి ఉమ్మడి నిరోధక వ్యవస్థను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇది ఏదైనా ఉత్తర కొరియా అణు, క్షిపణి ముప్పును ప్రాథమికంగా అడ్డుకుంటుందని యూన్ తన నూతన సంవత్సర దినోత్సవ ప్రసంగంలో అన్నారు. కాగా, 1953లో సైనిక ఘర్షణ తర్వాత కొరియా ద్వీపకల్పం ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడిపోయింది. కానీ, అప్పట్లో యుద్ధ విరమణ ప్రకటన చేయలేదు. దీంతో సాంకేతికంగా రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాలు ఎప్పటికైనా విలీనం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. అది నెరవేరడం అసాధ్యంగా మారింది. కిమ్‌ అధికారం చేపట్టాక.. ఇవి పతాక స్థాయికి చేరాయి. కిమ్ తాజా ప్రకటనతో పునరేకీకరణ అసాధ్యమని తేలిపోయింది.


భవిష్యత్తులో దక్షిణ కొరియా శాంతి ప్రతిపాదనలు చేసినా.. ప్యాంగ్‌యాంగ్ వాటిని తిరస్కరించడం ఖాయం. ఇది ఆసియాలో ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉంది. గత వారం కిమ్‌ జోంగ్‌ ఉన్‌ దేశంలోని ఆయుధ తయారీదారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అమెరికాతో ఎలాంటి ఘర్షణ తలెత్తినా.. తట్టుకొనేలా ఆయుధ తయారీని వేగవంతం చేయాలని సూచించినట్టు కేసీఎన్‌ఏ వెల్లడించింది. అమెరికా కారణంగా కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరిగిపోయాయని ఆరోపించింది. 2023లో ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. దేశ హోదాను రాజ్యాంగంలో అణుశక్తిగా పొందుపరిచింది. అత్యంత అధునాతన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. అంతకు ముందు 2022లో తనను తాను తిరుగులేని అణుశక్తిగా ప్రకటించుకుంది. తన అణ్వాయుధ కార్యక్రమాన్ని ఎప్పటికీ వదులుకోదని పదేపదే నొక్కిచెప్పిన కిమ్.. పాలనలో తన మనుగడకు అవసరమైనదిగా స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa