గత కొద్ది రోజులుగా ఎర్రసముద్రంలో రవాణా నౌకలపై దాడులకు పాల్పడుతోన్న హౌతీ రెబల్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా నౌకాదళం జరిపిన హెలికాప్టర్ల దాడిలో 10 మంది హౌతీలు హతమయ్యారు. డెన్మార్క్ షిప్పింగ్ కార్పొరేషన్ మెర్స్ హంగ్జౌ వాణిజ్య నౌకను ఆదివారం హౌతీ రెబల్స్ హైజాక్ చేయడానికి ప్రయత్నించి, లో నాలుగు బోట్లలో దానికి సమీపంగా చేరుకున్నారు. ఈ క్రమంలో నౌక సిబ్బంది పంపిన సందేశాలతో అప్రమత్తమైన అమెరికా నేవీ.. హెలికాప్టర్లను రంగంలోకి దింపింది. బోట్లపై కాల్పులు జరిపి మూడింటిని ముంచేశారు. నాలుగోది అక్కడ నుంచి తప్పించుకొని వెళ్లిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో 10 మంది హౌతీలు హతమయ్యారు. కాగా, ఈ సంఘటన తర్వాత ఓ ప్రకటన విడుదల చేసిన మెర్స్ సంస్థ.. ఎర్ర సముద్రంలో 48 గంటల పాటు తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక, శనివారం కూడా మెర్స్ రవాణా నౌకపై హౌతీలు క్షిపణులను ప్రయోగించారని.. వాటిని తాము తిప్పికొట్టామని, మళ్లీ ఆదివారం చిన్న బోట్లతో దాడికి ప్రయత్నించారని అమెరికా వెల్లడించింది.
కాగా, ఈ ఘటనపై హౌతీ రెబల్స్ గ్రూప్ తీవ్రంగా స్పందించింది. ఎర్రసముద్రంలో అమెరికా సహా ఏ దేశం జోక్యం చేసుకున్నా పరిణామాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించింది. నౌక సిబ్బంది హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో తమ బృందం దాడికి పాల్పడిందని హౌతీల ప్రతినిధి తెలిపారు. తమ పడవలపై అమెరికా దళాలు ఎర్ర సముద్రంలో దాడి చేయడంతో 10 మంది చనిపోయారని ఆయన చెప్పారు. మరోవైపు, గాజాపై ఇజ్రాయేల్ దాడుల పరంపర కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 100 మంది మృతి చెందారని, 286 మంది గాయాలయ్యాయని గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. గాజాపై తాము చేస్తున్న యుద్ధం ఇప్పట్లో ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. గతేడాది అక్టోబరు 7న హమాస్ జరిపిన మారణహోమానికి ప్రతీకారంగా ఇజ్రాయేల్ దాదాపు 3 నెలల నుంచి భీకర దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో సుమారు 22 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
హమాస్కు మద్దతుగా యెమెన్కు చెందిన హౌతీ రెబల్స్.. గత నవంబరు నుంచి ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డుతున్నారు. దీంతో ప్రధాన షిప్పింగ్ కంపెనీలను సూయజ్ కెనాల్ ద్వారా కాకుండా ఆఫ్రికా కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ సుదీర్ఘమైన, ఖరీదైన మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. ఎర్ర సముద్రం సూయజ్ కెనాల్ను ఉపయోగించే నౌకలకు ప్రవేశ స్థానం. ఇది ప్రపంచ వాణిజ్యంలో 12%ని నిర్వహిస్తుంది. ఆసియా, ఐరోపా మధ్య వస్తువుల తరలింపుకు ముఖ్యమైనది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa