ఎవరు కలిసినా, ఎన్ని కూటములుగా వచ్చినా మాకు భయం లేదని వైయస్ఆర్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైయస్ఆర్టీపీని వైయస్ షర్మిల కాంగ్రెస్లో విలీనం చేశారు. ఈ పరిణామంపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఎవరు ఏ పార్టీలో చేరినా.. తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని అన్నారు. ఏపీ ప్రజలు మళ్లీ వైయస్ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. మాకు దేవుడి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఎవరు ఏ పార్టీలో చేరినా మాకు ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. అలాగే.. తాను వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడనన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్నిస్థానాల్లో వైయస్ఆర్సీపీ గెలుపు కోసం జరుగుతున్న మార్పుల గురించి స్పందిస్తూ.. పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామని, అన్నినియోజకవర్గాల్లో మార్పులు చేస్తున్నామని, ఇది కొంతమందికి నచ్చకపోవచ్చని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైయస్ జగన్ కాకుండా వేరే వాళ్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే పేద కుటుంబాలు నష్ట పోతాయని.. అందుకే ప్రజల ఆశీస్సులు మాతోనే ఉంటాయి అన్నారు. నారా లోకేష్ నావ మునిగి పోయింది, జాకీలు వేసి లేపుతున్నారు, అయినా లేవడం లేదు అంటూ వైవీ సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. అనంతరం అనకాపల్లిలో నిర్వహించిన సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa