సంక్రాంతికి ఊరెళ్లేవారికి ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో పాటు పలు నగరాల నుంచి సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చి వెళ్లేవారి కోసం రెగ్యులర్ సర్వీసులతోపాటు అదనంగా 6,795 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. వీటిలో సాధారణ ఛార్జీలే తీసుకోనున్నట్లు తెలిపారు. సంక్రాంతికి ముందు ఈ నెల 6 (శనివారం) నుంచి 14 వరకు 3,570 బస్సులు.. తిరుగు ప్రయాణాల కోసం ఈ నెల 16 నుంచి 18 వరకు 3,225 బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించారు.
సంక్రాంతికి ముందు నడిపే బస్సుల్లో హైదరాబాద్ నుంచి 1,600, బెంగళూరు నుంచి 250, చెన్నై నుంచి 40, విజయవాడ నుంచి 300, విశాఖపట్నం నుంచి 290, రాజమహేంద్రవరం నుంచి 230, తిరుపతి నుంచి 70, ఇతర ప్రాంతాల నుంచి 790 బస్సు సర్వీసులు ఉంటాయి. ఈ నెల 10 నుంచి 13వ తేదీ మధ్య రెగ్యులర్ సర్వీసుల్లో ముందుస్తు రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తయ్యాయని.. ఆయా మార్గాల్లో ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీటిల్లో కూడా రిజర్వేషన్లు మొదలైనట్లు చెప్పారు.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు పెంచుతామని.. ప్రత్యేక బస్సుల పర్యవేక్షణకు అన్ని జిల్లా కేంద్రాలు, హైదరాబాద్లోని పలు పాయింట్లలో సూపర్వైజర్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ బస్సుల సమాచారంకోసం, ఏవైనా సమస్యలు ఉన్నా కాల్ సెంటర్ నంబరు 149కి గానీ, 0866-2570005 నంబరుకు ఎప్పుడైనా ప్రయాణికులు ఫోన్ చేయొచ్చని తెలిపారు.బస్సులకు జీపీఎస్ ట్రాకింగ్, 24 గంటలు సేవలు అందించే సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
అంతేకాదు ఈ బస్సుల్లో అదనపు చార్జీల భారం లేకుండా సాధారణ చార్జీలతోనే నడుస్తాయి. అలాగే ఛార్జీలకు చిల్లర సమస్య లేకుండా ఉండేందుకు యూటీఎస్ మెషిన్ల ద్వారా టికెట్ల జారీ విధానాన్ని ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు ఫోన్పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా టికెట్లు తీసుకోవచ్చు. మరోవైపు ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కూడా ఆర్టీసీ కల్పించింది. ఒకేసారి రానూపోనూ రిజర్వేషన్ చేసుకుంటే 10శాతం రాయితీ ఇస్తోంది. దీంతో సాధారణ చార్జీల కంటే తక్కువతోనే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది.
ప్రయాణికులపై భారం పడకూడదనే సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది నిర్ణయించిందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. సంక్రాంతి ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సేవలు అందించేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని.. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa