ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఏపీ మంత్రి సతీమణి?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 08, 2024, 08:22 PM

విశాఖపట్నం వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ పేరును ఆ పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తోందనే ప్రచారం జరుగుతోంది. అక్కడి నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసే అభ్యర్థి ఎంపికపై పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్‌ మంత్రి బొత్స సత్యనారాయణ భార్య అయిన ఝాన్సీ పేరును ప్రతిపాదించినట్లు ఊహాగానాలువినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆమె విజయనగరం నుంచి ఆమె ఎంపీగా పనిచేశారు. విశాఖపట్నం సిట్టింగ్‌ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈసారి విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రతిపాదించడంతో ఆయనకు అక్కడ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. దీంతో ఎంపీ సీటుకు అభ్యర్థి ఎవరనే చర్చ జరుగుతోంది.. ఈ క్రమంలో బొత్స ఝాన్సీ పేరు తెరపైకి వచ్చింది. అంతేకాదు బొత్స ఝాన్సీలక్ష్మి గతంలో విజయనగరం ఎంపీగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. దీంతో ఆమె వైపు మొగ్గు చూపారనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఈ అంశంపై అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు.


విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని ఎంపిక చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని.. దీనిపై అభిప్రాయం చెప్పాలని మంత్రిని మీడియా ప్రతినిధుల కోరారు. తనకు ఎలాంటి సమాచారం లేదని.. షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తున్నారని, దీనిపై స్పందించాలని విలేకరులు కోరగా ఇతర పార్టీల గురించి తాము ఆలోచించమని పేర్కొన్నారు. వైఎస్సార్‌‌సీపీ నుంచి నేతలు వెళ్లినా...ఇతర పార్టీల నుంచి వస్తుంటారని, అలాంటి విషయాలను అధిష్ఠానం పట్టించుకోదన్నారు. పార్టీ నుంచి ఒకరు వెళితే వంద మంది వస్తారని, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఏ ప్రభుత్వమైనా ఒక్కసారి మాత్రమే జీతం పెంచుతుందని.. రెండు, మూడుసార్లు పెంచడం సరికాదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తాము ఉద్యోగులకు వ్యతిరేకం కాదని.. అంగన్‌వాడీలైనా, మున్సిపల్ కార్మికులైనా, ఉపాధ్యాయులైనా అంతా ఒక్కటేనన్నారు. ఈ 5వ తేదీ నుంచి విధుల్లోకి వెళ్లాలని అంగన్‌వాడీలకు ముందే చెప్పామన్నారు. వారి 11 డిమాండ్లలో పదింటిని నెరవేర్చామని, జీతాల పెంపు అంశం పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఎస్మా చట్టం ప్రయోగంపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. పురపాలిక కార్మికుల డిమాండ్లు కొలిక్కి వచ్చాయని, ఇప్పటికే నాలుగు విభాగాల వారికి జీతాలు పెంచామని మంత్రి బొత్స తెలిపారు. ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కల్పిస్తామని.. వెంటనే సమ్మె విరమించాలని, లేకపోతే ప్రజలు క్షమించబోరన్నారు. ఎన్నికలు వస్తున్న సమయంలో ప్రతిపక్షాలు, కమ్యూనిస్టు పార్టీలు చెప్పినట్లు చేస్తామనడం సరికాదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa