ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. బంగాళాతాన్ని అనుకొని ద్రోణి కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించిన ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఉత్తర శ్రీలంక తీరం మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వెల్లడించింది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడుతాయంటున్నారు. ఇవాళ పార్వతీపురం మన్యం, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాల్లో వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు తమిళనాడులో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి.
మరోవైపు ఏపీలో చలి తీవ్రత కొనసాగుతోంది. ముఖ్యంగా మన్యంలో ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి. జి.మాడుగుల, జీకే వీధిలో 6, అరకులోయలో 6.3, పాడేరు, పెదబయలులో 6.6, హుకుంపేటలో 7, ముంచంగిపుట్టులో 9.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఆదివారం నమోదయ్యాయి. ఆదివారం జీకేవీధిలో 6 డిగ్రీలు, చింతపల్లిలో 6.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత మూడు రోజులుగా ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గి, చలి ప్రభావం పెరుగుతున్నది. దీంతో ఉదయం పది గంటల వరకు ఏజెన్సీలో పొగమంచు దట్టంగానే కమ్మేస్తోంది.
పొగ మంచు దట్టంగా కమ్ముకోవడంతో హెడ్ లైట్లు వేసుకుని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మధ్యాహ్నం వేళలో ఒక మోస్తరుగా చలి ప్రభావం తగ్గినా, సాయం త్రం నాలుగు గంటల నుంచే చలి ప్రభావం పెరుగుతున్నది. తాజా వాతావరణానికి ఏజెన్సీ వాసులు చలి మంటలు వేసుకుంటూ, రగ్గులు కప్పుకొని, ఉన్ని దుస్తులు ధరిస్తూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. అరకులోయ ప్రాంతంలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం 10 గంటల వరకు మంచు వీడడం లేదు. సాయంత్రం నాలుగు గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. దీంతో జనం బయటకు రావడానికే భయపడుతున్నారు. ఆదివారం అరకులోయలో 6.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకావడంతో జనం చలికి వణికిపోయారు. పర్యాటకులు క్యాంప్ ఫైర్ వేసుకుని చలి నుంచి ఉపశమనం పొందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa