ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిల్కిస్ బానో కేసులో సుప్రీం సంచలన తీర్పు.. గుజరాత్ ప్రభుత్వ ఉత్తర్వులు కొట్టివేత

national |  Suryaa Desk  | Published : Mon, Jan 08, 2024, 09:39 PM

బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులగా తేలిన 11 మంది ఖైదీలకు రెమిషన్ మంజూరు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. 11 మంది ఖైదీలను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో వేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది.


బిల్కిస్‌ బానోపై 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను గతేడాది గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. వారికి రెమిషన్ మంజూరు చేసిన గుజరాత్ సర్కార్.. వారిని జైలు నుంచి బయటకు విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయంపై తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు బిల్కిస్ బానో.. ఈ కేసులో దోషులుగా తేలి జీవితఖైదు అనుభవిస్తున్న వారిని జైలు నుంచి విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.


ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు పరిశీలించిన సుప్రీంకోర్టు.. గుజరాత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని బాధితురాలు బిల్కిస్ బానో సవాల్ చేయడం సబబేనని పేర్కొంది. దీంతోపాటు 11 మంది దోషులను విడుదల చేస్తూ గుజరాత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఈ కేసులో దోషులైన 11 మంది ఖైదీలకు రెమిషన్‌ మంజూరు చేస్తూ గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది.


2002 లో జరిగిన గోద్రా రైలు దహనకాండ తర్వాత గుజరాత్‌లో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో 5 నెలల గర్భిణిగా ఉంది. ఆ సమయంలో కొందరు దుండగులు.. గర్భిణీ అని కూడా చూడకుండా బిల్కిస్ బానోపై అతి కిరాతకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా చిన్నా పెద్దా తేడా లేకుండా బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21 వ తేదీన జీవిత ఖైదు విధించింది. అయితే గతేడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ 11 మంది దోషులకు రెమిషన్ మంజూరు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే బాధితురాలు బిల్కిస్ బానో ఆ నిర్ణయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa