ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జపాన్‌లో మరోసారి భారీ భూకంపం.. భయంతో వణికిపోతున్న జనం

international |  Suryaa Desk  | Published : Tue, Jan 09, 2024, 09:54 PM

జపాన్‌లో మంగళవారం మరోసారి భూకంపం సంభవించింది. జపాన్‌ మధ్య ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది. జపాన్ సముద్ర తీరంలో ఈ భూకంపం సంభవించినట్టు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం అందలేదు. అయితే, సునామీ ముప్పు లేకపోవడంతో జనం కొంత ఊపిరిపీల్చుకున్నారు. జనవరి 1న సెంట్రల్ జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో వరుస భూప్రకంపనలు సంభవించి.. దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. భూకంపం వల్ల సునామీ వచ్చి.. కొన్ని ప్రాంతాల్లో అలలు 2 నుంచి 5 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. ఆ ఘటన నుంచి తేరుకోక ముందే.. మళ్లీ భూకంప సంభవించింది.


న్యూఇయర్ తొలి రోజున సెంట్రల్ జపాన్‌లో 7.5 తీవ్రతతో భూకంసం సంభవించింది. ఈ భూప్రకంపనల ధాటికి చాలా భవనాలు, రోడ్లు, ఇళ్లు ధ్వంసం అయ్యాయి. చాలా మంది శిథిలాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 600 మంది గాయపడ్డారు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే, భూకంపం తర్వాత 100 నుంచి 120 మంది వరకూ ఆచూకీ గల్లంతయ్యింది. వీరి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. మంచు కురుస్తున్నందున సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.భూకంప కారణంగా బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి మారమూల ప్రాంతాల్లో దాదాపు 3,500 మంది చిక్కుకున్నారు. కాగా, భూకంపం ధాటికి కూలిపోయిన ఓ ఇంటి శిథిలాల్లో చిక్కుకొన్న 90 ఏళ్ల వృద్ధురాలిని ఐదు రోజుల తర్వాత సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసిన విషయం తెలిసిందే. సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో 72 గంటల తర్వాత ప్రాణాలతో ఉండే అవకాశాలు తగ్గుతాయి. కానీ, ఐదు రోజులు గడిచినా ఆ వృద్ధురాలు సజీవంగా బయటపడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa