ఏపీలో కరెన్సీ కట్టల గుట్టలు బయటపడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో టోల్ ప్లాజాల దగ్గర రైల్వే స్టేషన్లలో సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రైల్లో అక్రమంగా తరలిస్తున్న కరెన్సీ కట్టల్ని పోలీసులు సీజ్ చేశారు. నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్ప్రెస్ (12974)లో ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో మంత్రాలయం (ఉమ్మడి కర్నూలు జిల్లా) రైల్వే స్టేషన్లో ఇద్దరు ఎస్సైలు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఎస్-3 బోగీలో నుంచి ఓ వ్యక్తి రెండు బ్యాగులతో దిగాడు. అనుమానం వచ్చి అతడ్ని ప్రశ్నించగా.. ఆదోనికి వెళ్తున్నట్లు చెప్పాడు.
ఆ వ్యక్తి చేతుల్లో ఉన్న బ్యాగుల్ని కూడా తనిఖీ చేయగా.. అందులో రూ.1,00,95,450 డబ్బులు ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఆధారాలు, డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీల రశీదులు లేకపోవటంతో డబ్బుల్ని సీజ్ చేశారు. అదే రైల్లో ఆదోని రైల్వే పోలీసు స్టేషన్కు తీసుకువెళ్లారు. ఆ డబ్బుల్ని తరలిస్తున్న వ్యక్తి ఆదోని హవన్నపేటకు చెందిన కోల్కర్ మహమ్మద్గా గుర్తించారు పోలీసులు. ఈ వ్యక్తి ధర్వేష్ అనే బంగారం వ్యాపారి దగ్గర ఆరు నెలలుగా గుమాస్తాగా పని చేస్తున్నాడు.
నిందితుడిని ప్రశ్నించగా.. సికింద్రాబాద్లో తమ యజమాని సూచించిన వ్యక్తి నుంచి డబ్బుల్ని తీసుకువస్తున్నట్లు తెలిపారు. తాము స్వాధీనం చేసుకున్న డబ్బుల్ని ఆదాయపన్నుశాఖ అధికారులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఆదోని, మంత్రాలయం పోలీసులను అధికారులు అభినందించారు. ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బులు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలకు సంబంధించి ప్రయాణికులు 9440627669 నంబర్కు సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి తగిన పారితోషికం అందిస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa