అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ముందుగా నిర్ణయించిన దివ్యమైన ముహూర్తం ప్రకారం.. గర్భగుడిలో రాముడు కొలువుదీరాడు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ మహత్తర కార్యక్రమాన్ని చూసిన భక్త జనం.. రామ నామ స్మరణతో పరవశించిపోయింది. కొత్తగా నిర్మించిన రామ మందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా నిర్ణయించిన ముహర్తం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్య గర్భగుడిలో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొదలైంది. బాల రాముడికి ప్రధాని నరేంద్ర మోదీ పట్టు వస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. అనంతరం రామ్ లల్లా విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరిగ్గా మధ్యాహ్నం 12.29 గంటలకు అభిజిత్ లగ్నంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది.
ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్-ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య నగరం మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆధ్యాత్మిక శోభతో అయోధ్య కళకళలాడింది. ఎటు చూసినా రామనామ స్మరణతో మార్మోగింది. నగరమంతా రామ్ లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు అయోధ్యకు వచ్చి చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ మహత్తర ఘట్టాన్ని స్వయంగా వీక్షించేందుకు దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిపి దాదాపు 7 వేల మంది అయోధ్యకు వచ్చారు. రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ప్రాణ ప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించి పులకించిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa