ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల కల నెరవేరింది. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేలాది మంది ప్రత్యక్షంగా.. కోట్లాది మంది టీవీల ద్వారా ఈ కార్యక్రమాన్ని తిలకించి.. పులకించిపోయారు. జనవరి 24 నుంచి అంటే బుధవారం నుంచి సామాన్య భక్తులు అయోధ్య రాముణ్ని సందర్శించుకోవచ్చు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో రాముడికి కట్టిన గుడి కావడంతో.. ఆ బాల రాముణ్ని సందర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలిరానున్నారు.
రోజుకు 3 లక్షల మందికిపైగా భక్తులు ఆ అయోధ్య రాముణ్ని సందర్శిస్తారని అంచనా. భక్తుల తాకిడి ఈ ఒక్క ఏడాదికే పరిమితం కాబోదు. 3-4 ఏళ్లపాటు ఇదే సంఖ్యలో అయోధ్య రాముడి దర్శనం కోసం భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇందుకు తగ్గట్టుగానే అయోధ్య చేరుకోవడానికి రైలు, విమాన సదుపాయాలను కల్పిస్తోంది. రోజుకు 60 వేల మంది ప్రయాణికులు వచ్చినా ఇబ్బంది కలగకుండా అయోధ్య రైల్వే స్టేషన్ను విస్తరించారు. ఏడాదికి 10 లక్షల మందికి ప్రయాణికులు వస్తారనే అంచనాతో అయోధ్య విమానాశ్రయాన్ని నిర్మించారు. ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో 2025 నాటికి టెర్మినల్ను విస్తరించనున్నారు. అయోధ్య ఇక ప్రత్యేక బస్సుల ద్వారానూ భారీ సంఖ్యలోనూ భక్తులు అయోధ్య చేరుకునే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో.. దేశంలోకెల్లా అత్యంత రద్దీ అయిన ఆలయంగా అయోధ్య రామాలయం నిలిచే అవకాశం ఉంది. ఎక్కువ మంది సందర్శించుకునే ఆలయాల జాబితాలో తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయం అగ్రస్థానంలో కొనసాగనుండగా.. ఈ ఏడాది ఆ స్థానాన్ని అయోధ్య ఆక్రమించే అవకాశం ఉంది. ప్రస్తుతం రోజుకు 60 వేల నుంచి 80 వేల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ను సందర్శించే పర్యాటకుల్లో తిరుమలకు వచ్చే భక్తులే అత్యధికం. ప్రపంచంలోకెల్లా సంపన్న ఆలయాల జాబితాలో తిరుమల ముందు వరుసలో ఉండగా.. అయోధ్య కూడా ఈ జాబితాలో చేరనుంది.
దేశంలో అత్యధిక మంది భక్తులు సందర్శించే ఆలయాల్లో ఉత్తర ప్రదేశ్లో ఉన్న కాశీ విశ్వనాథ్ ఆలయం ఒకటిగా ఉంది. ఇప్పుడు రామ మందిరం కూడ ప్రారంభం కావడంతో.. ఆధ్యాత్మికంగా ఉత్తరప్రదేశ్ ప్రాధాన్యం మరింత పెరగనుంది. అంతే కాదు అత్యధిక మంది దేశీయ పర్యాటకులు సందర్శించే రాష్ట్రంగా ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న ఉత్తర ప్రదేశ్.. రాముడి రాకతో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోనుంది. ఆగ్రాలోని తాజ్ మహల్, ఎక్స్ప్రెస్ వేలు, అయోధ్య, వారణాసి.. వీటన్నింటి వల్ల ఉత్తర ప్రదేశ్ పర్యాటకం ఊపందుకోనుంది. ఇటీవలే దేశంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా యూపీ ఎదిగింది. తాజాగా రాముడి రాకతో ఆ రాష్ట్ర జీడీపీ వృద్ధి మరింత వేగంగా పెరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa