లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం వీరిద్దరూ చేసిన పోరాటం, కృషి ఎనలేనిది. అయోధ్యలో రాముడికి ఆలయం నిర్మించాలని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమానికి వీరు నాయకత్వం వహించారు. ఇక అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని వారు ప్రారంభించిన రథయాత్ర.. మొత్తం ఉద్యమంలోనే కీలక ఘట్టం అని చెప్పుకోవచ్చు. అలాంటి బీజేపీ కురువృద్ధులు.. వారు కన్న కల అయిన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి దూరంగా ఉన్నారు.
అయోధ్యలో నేడు జరిగిన బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అద్వానీ, మురళీ మనోహర్ జోషి హాజరు కాకపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే తీవ్రమైన చలి కారణంగానే అద్వానీ అయోధ్యకు రాలేదని తెలుస్తోంది. మరోవైపు.. వయసు పైబడిన కారణంగానే మురళీ మనోహర్ జోషి అయోధ్యకు రాలేదనే వార్తలు వస్తున్నాయి. అయితే అయోధ్య ప్రారంభోత్సవానికి సంబంధించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అందించిన ఆహ్వానాల సమయం నుంచే ఈ చర్చ మొదలైంది. అసలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు ఆహ్వానమే అందలేదనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని అయోధ్య ఆలయ అధికారులు ఖండించారు. వారిద్దరికీ ఆహ్వానాలు అందించామని.. అయితే వయసు, ఆరోగ్యం దృష్ట్యా వారు అయోధ్యకు రావద్దని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
అయితే అయోధ్యలో రామ మందిర సాధన కోసం తీవ్రంగా కృషి చేసిన వారికి ఆహ్వానాలు అందలేదనే విమర్శలు వెల్లువెత్తిన వేళ.. వారికి ఆహ్వానాలు అందించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. అద్వానీ వయసు 96 ఏళ్లు కాగా.. మురళీ మనోహర్ జోషి వయసు 90 ఏళ్లని.. వయసు, ఆరోగ్య సంబంధిత సమస్యల దృష్ట్యా ఈ సీనియర్ నేతలిద్దరూ బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన లేదనే వార్తలు వచ్చాయి. 90 వ దశకంలో రామమందిర ఉద్యమానికి అద్వానీ, మురళీ మనోహర్ జోషి నాయకత్వం వహించారు. ఎల్కే అద్వానీ నేతృత్వంలో 1990 లో గుజరాత్లోని సోమనాథ్ నుంచి అయోధ్యలోని రామ జన్మభూమికి బీజేపీ రథయాత్రను ప్రారంభించింది. మందిర్ వహీ బనాయేంగే నినాదంతో అద్వానీ రామమందిర ఉద్యమాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లారు. మురళీ మనోహర్ జోషి కూడా ఈ రథయాత్రలో కీలకంగా వ్యవహరించారు. ఈ రథయాత్రలో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa