ఏపీలో వివాహాల నమోదుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఫీజులు పెరిగాయి. వివాహ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 ఉండగా దానిని ఇప్పుడు రూ.500కు పెరిగింది. దంపతుల అభ్యర్థనతో కార్యాలయం బయట జరిగే వివాహ వేదిక దగ్గరకు సబ్ రిజిస్ట్రార్ వస్తే ఇప్పటివరకు ఉన్న రూ.210 ఫీజును రూ.5 వేలకు పెంచింది. ప్రస్తుత సంవత్సరంలో వివాహాల రికార్డుల పరిశీలనకు రూపాయి ఉన్న ఫీజును రూ.100కు, సెలవు రోజుల్లో వివాహాల నమోదుకు రూ.5 వేలకు పెంచారు. దీని కోసం 1955 హిందూ వివాహ రిజిస్ట్రేషన్ చట్టానికి సంబంధించి 1965 మార్చిలో జారీచేసిన ఫీజులను ఇటీవల సవరించి ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు వివాహ రిజిస్ట్రేషన్లు మరింత సులభతరం కానున్నాయి. ఆన్లైన్లోనే నమోదు చేసుకునే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఆన్లైన్లో వివాహ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. త్వరలో పూర్తి స్థాయిలో ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు హిందూ వివాహాలు, ప్రత్యేక వివాహాలను సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మాన్యువల్గా రిజిస్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు అవసరమైన ఫొటోలు, ఆధార్ కార్డ్లు, ముగ్గురు సాక్షులతో రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్లు సబ్ రిజి్రస్టార్ కార్యాలయానికి వెళ్లి సంబంధిత ఫామ్ పూర్తి చేసి సబ్ రిజిస్ట్రార్కి ఇచ్చేవారు. ఆయన దాన్ని సరిచూసి పుస్తకంలో నమోదు చేసుకునేవారు. ఆ తర్వాత సర్టిఫికెట్పై సంతకం పెట్టి దాన్ని ఇచ్చేవాళ్లు. ఇకపై ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరగనుంది.
ఇకపై www.registrations.ap.gov.inలో హిందూ వివాహాలు, ప్రత్యేక వివాహాలు అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. హిందూ వివాహమైతే దానిపై క్లిక్ చేసి మొబైల్ నంబర్ లేదా ఇ–మెయిల్ ద్వారా ఓటీపీతో లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అనంతరం ఆన్లైన్లోనే ఫామ్ని పూర్తి చేసి, ఆధార్ కార్డ్లు, పెళ్లి ఫొటోలు, పదో తరగతి సరి్టఫికెట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రార్కి ఆఫీసుకు వెళ్లేందుకు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం.. కచ్చితంగా రిజిస్ట్రార్ ముందు హాజరు కావాలని ఉండడంతో స్లాట్ బుక్ చేసుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాలి.
సీఎఫ్ఎంఎస్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్లైన్లో చలానా ద్వారా కట్టే అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఆన్లైన్లో నమోదు చేసిన దరఖాస్తును సబ్ రిజిస్ట్రార్కి ఇస్తే ఆయన దాన్ని పరిశీలించి.. సాక్షులతో సంతకాలు పెట్టించుకుని వెంటనే సర్టిఫికెట్ను జారీ చేస్తారు. రిజిస్ట్రేటేషన్ అయ్యాక సర్టిఫికెట్లో వాళ్ల ఫొటోలూ జతచేస్తున్నారు. ఆ తర్వాత అదే ఆన్లైన్లోనూ వస్తుంది.మొన్నటివరకు ఒకరోజు తర్వాత సర్టిఫికెట్ ఇస్తుండగా ఆన్లైన్లో వెంటనే వస్తుంది. హిందూ వివాహ చట్టం ప్రకారం కాకుండా జరిగిన పెళ్లిళ్లను ప్రత్యేక వివాహాల కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి వెబ్సైట్లో ప్రత్యేకంగా అవకాశం ఉంది. దీనికి ఒక నెల నోటీసు పీరియడ్ ఉంటుంది. అంటే నెల ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే దానిపై రిజిస్ట్రార్ కార్యాలయం అభ్యంతరాల స్వీకరణకు బోర్డులో నోటీసును పెడుతుంది. అభ్యంతరాలు లేకపోతే నెల తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్ను పూర్తి చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa