ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల తుది జాబితా విడుదలైంది. మొత్తం ఓటర్ల సంఖ్య 4,08,07,256కు చేరగా.. ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో 5,86,530 మంది ఓటర్లు పెరిగారు. గతేడాది అక్టోబరు 27న విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 4,02,21,450 మంది ఓటర్లు ఉండగా ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత ఎన్నికల సంఘం కొత్తగా 22,38,952 మంది ఓటర్లను జాబితాలో చేర్చింది. అలాగే 16,52,422 మందిని తొలగించింది. తుదిజాబితా ప్రకారం రాష్ట్రంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లు 6,55,130 మంది ఎక్కువగా ఉన్నారు. ఓటర్ల
తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 25 జిల్లాల్లో పెరగ్గా.. ఒక్క నెల్లూరు జిల్లాలో మాత్రం స్వల్పంగా తగ్గింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 45,403 మంది, అన్నమయ్య జిల్లాలో 44,614 మంది, కర్నూలు జిల్లాలో 43,466 మంది ఓటర్లు పెరిగారు. నెల్లూరు జిల్లాలో 2,934 మంది తగ్గారు. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లాల్లో కర్నూలు (20,16,396) మొదటి స్థానంలో ఉంటే.. ఆ తర్వాత స్థానాల్లో అనంతపురం (19,96,637), విశాఖపట్నం (19,46,224), నెల్లూరు (19,08,498) జిల్లాలు ఉన్నాయి. అతి తక్కువ ఓటర్లు కలిగిన జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా (7,61,538) తొలి స్థానంలో, పార్వతీపురం మన్యం జిల్లా (7,77,764) రెండో స్థానంలో ఉన్నాయి. శ్రీకాకుళం, ప్రకాశం మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారు. 2023 జనవరి 5 నాటికి రాష్ట్రంలో 45,951 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 46,165కు పెరిగింది.
మరోవైపు ఓటర్ల తుది జాబితాలో అభ్యంతరాల పరిష్కారానికి సచివాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా తెలిపారు. మంగళవారం నుంచి ఈ సెల్ పనిచేస్తుందని.. ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియకు సంబంధించి పోలింగ్ తేదీకి పది రోజుల ముందుగా అందే వివరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందన్నారు. ఓటర్ల తుది జాబితా ప్రకటించిన తర్వాత వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఓటర్ల జాబితా సవరణపై ప్రతి వారం జిల్లా ఎన్నికల అధికారి, ఈఆర్వో స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తామన్నారు. ఒకవేళ జాబితాలో మార్పులు, చేర్పులు, ఏవైనా సందేహాలుంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.
రాష్ట్రంలో 80 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచి ఓటు వేసే విధానాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రవేశపెడుతున్నట్లు ముకేశ్కుమార్ మీనా తెలిపారు. ఇలాంటి వారు 4.70 లక్షల మంది ఉంటారని చెప్పారు. వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఓటు వేయించే సమయంలో ఎన్నికల సిబ్బందితో పాటు రాజకీయ పార్టీల ఏజెంట్లనూ అనుమతిస్తామన్నారు. దివ్యాంగులు ఎవరైనా పోలింగ్ కేంద్రాలకు రాలేమని ముందుగా తెలియజేస్తే.. వారికి కూడా ఈ అవకాశం కల్పిస్తామన్నారు. యువత ఓటుహక్కు నమోదు చేసుకునేలా మంగళవారం నుంచి విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేస్తామన్నారు. రాజకీయ పార్టీల నుంచి దొంగ ఓట్లపై వచ్చిన ఫిర్యాదులపై విచారించి 5.60 లక్షల మందిని జాబితాల నుంచి తొలగించినట్లు తెలిపారు. ఇలాంటి ఓటర్లు 14 లక్షల మంది వరకు ఉన్నారని ఫిర్యాదులు అందాయని.. 98శాతం సరిచేశామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa