ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీలో చేరిన వీరశివారెడ్డి, కొలికపూడి శ్రీనివాసరావు, శ్రీకాంత్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 27, 2024, 09:59 PM

టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు, ఆదోనికి చెందిన ఎసి శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం పార్టీలో చేరారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ విధ్వంస పాలనకు చరమగీతం పాడేందుకు...తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తాము పనిచేస్తామని వారు తెలిపారు.


రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాల్సిన అవసరం ఉందని పార్టీలో చేరిన నేతలు చెప్పారు. రాష్ట్రం కోసం, యువత భవిష్యత్ కోసం రానున్న ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీని గెలిపించేందుకు పనిచేస్తామని ఈ సందర్భంగా నేతలు ప్రకటించారు. ప్రజా వ్యతిరేక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని దించేందుకు కలిసి వచ్చిన నేతలను చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.


క‌డ‌ప జిల్లా క‌మ‌లాపురం నియోజకవర్గానికి చెందిన వీర‌శివారెడ్డి.. టీడీపీతోనే రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1994లో తొలిసారి టీడీపీ అభ్యర్థిగా క‌మ‌లాపురం నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలిచారు. త‌ర్వాత 1999 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంవీ మైసూరారెడ్డి చేతిలో ఓడిపోయారు.. 2004లో టీడీపీ అభ్యర్థిగా మ‌ళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేసినా ఓటమి తప్పలేదు. అయితే 2009 ఎన్నిక‌ల నాటికి కాంగ్రెస్ పార్టీలో చేరారు.. 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడి నుంచే గెలపొందారు.


ఆ తర్వాత, ఆంధ్రప్రదేశ్ విభజన, ఇతర పరిణామాలతో 2014, 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. కానీ తగినంత ప్రాధాన్యత దక్కడం లేదంటూ చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.. ఇప్పుడు మళ్లీ టీడీపీ గూటికి చేరారు. ఇటు కొలికపూడి శ్రీనివాసరావు గతంలో సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహించేవారు.. ఆ తర్వాత అమరావతి రైతుల ఉద్యమంలోకి వచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు ఉన్నారు. ఆయన కూడా టీడీపీలో చేరారు. మరోవైపు రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని టీటీడీపీ చెబుతోంది. అలాగే చంద్రబాబు నేటి నుంచి రా కదలి రా సభలకు హాజరుకానున్నారు. ఇవాళ అనంతపురం జిల్లా ఉరవకొండ, అన్నమయ్య జిల్లా పీలేరులో రా కదలి రా సభలు జరగనున్నాయి. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ ఈ రెండు చోట్ల భారీ ఏర్పాట్లు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa