ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అందుబాటులో లేరని, త్వరలో నాయకత్వంలో మార్పు ఉంటుందన్న ఊహాగానాలతో జార్ఖండ్ రాజకీయాలు వేడెక్కాయి.ఈ క్రమంలో సోరెన్ నివాసంతోపాటు రాజ్భవన్, ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. అయితే.. ఆయన రాంచీలోని అధికారిక నివాసానికి చేరుకున్నట్లు సమాచారం. ఈడీ విచారణ నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్ను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు సోమవారం దిల్లీలోని సీఎం అధికారిక నివాసానికి వెళ్లారు. 13 గంటల పాటు ఎదురుచూశారు. కానీ ఆయన మాత్రం వారికి అందుబాటులోకి రాలేదు. సోదాల్లో భాగంగా అధికారులు రెండు బీఎండబ్ల్యూ కార్లు, దస్త్రాలు, రూ.36 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. జనవరి 31న రాంచీలోని తన నివాసానికి రావాలని సోరెన్ ఇప్పటికే ఈడీ అధికారులకు సందేశం పంపారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయనను విచారించే అవకాశాలున్నట్లు కన్పిస్తోంది. ఈ పరిణామాలతో సీఎం మిస్సింగ్ అంటూ భాజపా విమర్శలు గుప్పిస్తోంది. సోరెన్ చిత్రంతో ఉన్న పోస్టర్ను ఎక్స్లో పోస్టు చేసి, ఆయన గురించి సమచారం ఇచ్చిన వారికి రూ.11 వేల రివార్డు ప్రకటించింది.
ముఖ్యమంత్రి సోరెన్ నుంచి స్పందన కోసం అందరిలాగే తానూ ఎదురుచూస్తున్నట్లు జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాక్రిష్ణన్ వెల్లడించారు. 'చట్టానికి ఎవరూ అతీతులు కాదని నేను చెప్తూనే ఉన్నాను. రాజ్యాంగం పరిధిలోనే మనమంతా పనిచేయాలి. రాజకీయంగా ఉన్న విభేదాలతో నాకు సంబంధం లేదు. ఎట్టిపరిస్థితుల్లో శాంతిభద్రతలకు మాత్రం విఘాతం కలగకూడదు' అని గవర్నర్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa