ఫిబ్రవరి 16న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలను నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. సూర్య జయంతిని పురస్కరించుకొని ఆలయంలో వేడుకలు జరగనున్నాయని తెలిపింది. ఈ సందర్భంగా స్వామివారికి వాహన సేవలు ఉంటాయని చెప్పింది. సప్త వాహనాలపై శ్రీమలయప్పస్వామి ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ పర్వదినం నేపథ్యంలో ఆలయంలో ఆరోజున స్వామివారికి నిర్వహించే పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దుచేసింది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దుచేసినట్టు పేర్కొంది.
మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన తరువాత వచ్చే మాఘ శుద్ధ సప్తమి రోజును తిరుమలలో రథసప్తమిగా వేడుకలు నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. కాగా, తిరుమలలో రథసప్తమి వేడుకలు మినీ బ్రహ్మోత్సవాలుగా గుర్తింపు పొందాయి. ఒకే రోజున స్వామివారికి ఏడు వాహసేవలతో పాటు చక్రస్నానం కూడా నిర్వహిస్తారు. ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు తొలుత సూర్యప్రభ వాహనంపై స్వామివారు మాడవీధుల్లో విహరిస్తారు.
అనంతరం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు.
హిందూ సంప్రదాయంలో సూర్యాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మాఘ మాసం శుక్ల పక్షం సప్తమి తిథి నాడు సూర్యుడు ఏడు గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మాఘ సప్తమి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. అంతేకాదు, సూర్యుడు ఆరోగ్యప్రదాత. సూర్య నారాయణుడు ప్రత్యక్ష దైవం. కాబట్టి సూర్యోపాసన వల్ల రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయి.
మంత్రపుష్పాలలో ఒకటిగా పేర్కొనే ‘యోపం పుష్పం వేదా, పుష్పవాన్ ప్రజావాన్, పశుమాన్ భవతి’ అనే వాక్యం దీనికి సంబంధించినవే. సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశుసంపద సమృద్ధివంతుడు అవుతాడు. సూర్యకాంతిలోని కిరణాల వల్లే శరీరానికి సహజసిద్ధంగా విటమిన్ 'డి' లభిస్తుంది. శరీరంపై సూర్యకిరణాలు తప్పక ప్రసరించాలి. అందుకే వైదిక వాజ్మయం.. సంధ్యావందనం, సూర్యనమస్కారాలు, ఆర్ఘ్యప్రధానం మొదలైన ప్రక్రియల్ని ప్రవేశపెట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa