నిలక్కల్: శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం ఇవాళ ఉదయం ఇద్దరు మహిళలు సన్నిధానం వైపు ముందుకు కదిలారు. బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు ఆర్టీసీ బస్సులో పంబకు చేరుకున్నారు. పోలీసులు వాళ్లకు భారీ బందోబస్తు కల్పించారు. అదే సమయంలో మహిళలను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. సన్నిధానం నుంచి వెనుదిరిగి వస్తున్న అయ్యప్ప భక్తులు కూడా మహిళలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ట్రెక్కింగ్ దారిలో.. చంద్రనందన్ రోడ్డు వద్దు భక్తులు, నిరసనకారులు మహిళలను అడ్డుకున్నారు. మహిళా భక్తురాలు బిందు గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల బందోబస్తు మధ్య సన్నిధానం వస్తున్న మహిళలకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలతో హోరెత్తించారు. కానీ తాము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనుదిరిగి వెళ్లేది లేదని ఆ ఇద్దరు మహిళలు చెప్పారు. తమకు అనేక ఫెమినిస్టు సంఘాలు మద్దతు తెలిపినట్లు చెప్పారు. శబరిమల ప్రధాన పూజారి వల్లే ఈ సమస్య ఉత్పన్నం అవుతున్నట్లు భక్తురాలు బిందు ఆరోపించారు. సన్నిధానంకు కిలోమీటరు దూరంలో ఉన్న మారకూటం వద్ద ఇద్దరు మహిళలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. మరో వైపు ఓ మహిళ భక్తురాలకు చెందిన ఇంటి ముందు కోజికోడ్లో కొందరు ఆందోళన చేపట్టారు. ఆదివారం 11 మంది మహిళలకు చెందిన ఓ గ్యాంగ్ కూడా మార్గమధ్యలోనే వెనుదిరిగింది. మరి రెండు రోజుల్లో 40 మంది మహిళలు ఉన్న ఓ బృందం కూడా అయ్యప్ప దర్శనం కోసం వస్తున్నట్లు తెలుస్తోంది. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలు కూడా శబరిమల అయ్యప్పను దర్శించుకోవచ్చు అని ఇటీవల సుప్రీం ఇచ్చిన తీర్పుతో కేరళ రణరంగంగా మారిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa