తిరుమల శ్రీవారి భక్తులకు సంబంధించి టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు ఆలోచన చేస్తోంది. శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను భక్తులు ఇకపై ఆన్లైన్లోనే కోనుగోలు చేసేలా టీటీడీ చర్యలు తీసుకుంది. ఎంబీసీ-34లోని కౌంటర్ వద్ద టికెట్ల కోసం భక్తులు అధిక సమయం క్యూలైన్లో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంటున్న క్రమంలో టీటీడీ నూతన విధానం అమలు చేస్తోంది. సిఫార్సు లేఖలు అందజేసిన భక్తుల మొబైల్కు ఓ లింక్తో కూడిన మెసేజ్ను పంపుతున్నారు. భక్తులు ఆ లింకు క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్ వస్తుంది. అక్కడ ఆన్లైన్లో నగదు చెల్లిస్తే టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెండ్రోజుల నుంచి టీటీడీ ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలుచేస్తోంది. భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోనున్నారు.. ఆ తర్వాత పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోనున్నారు.
శ్రీవారి ఆశీస్సులతో ధార్మిక సదస్సు విజయవంతం
తిరుమల ఆస్థాన మండపంలో జరుగుతున్న ధార్మిక సదస్సుకు 57 మంది స్వామీజీలను ఆహ్వానించగా అందరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుగ్రహభాషణం అందించారని, ఈ విధంగా సదస్సు విజయవంతమైందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. నభూతో నభవిష్యతి అన్నట్టుగా ధార్మిక సదస్సు జరిగిందన్నారు. ధార్మిక సదస్సుకు స్వామి వారి ఆశీస్సులు చక్కగా ఉన్నాయనడంలో సందేహాలు లేదన్నారు. సదస్సులో శనివారం 24 మంది మహనీయులు, ఆదివారం 17 మంది మహనీయలు ప్రత్యక్షంగా, 16 మంది వర్చువల్ గా తమ సూచనలు, సలహాలు ఇచ్చారని వివరించారు. మఠాధిపతులు, పీఠాధిపతులు తమ కీలక సలహాలు, సూచనలిచ్చి టీటీడీకి దిశా నిర్దేశం చేశారని చెప్పారు. మహనీయుల ఉపన్యాసాలను రికార్డ్ చేశామని, వీటిని తీర్మానాలుగా చేసి రేపటి రోజున మఠాధిపతులు, పీఠాధిపతులు సమక్షంలో మీడియా ప్రతినిధుల ముందు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రవేశపెడతారని తెలిపారు. వచ్చే బోర్డు సమావేశంలో వీటిని ఆమోదించి టీటీడీ తదుపరి కార్యాచరణ చేపడుతుందని వెల్లడించారు.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 10న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు ఆలయం నుంచి శ్రీ గోవిందరాజ స్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీ విష్వక్సేనులవారు, శ్రీరామానుజాచార్యులు, శ్రీ నమ్మాళ్వార్, శ్రీ కూరత్తాళ్వార్, శ్రీ తిరుమంగైయాళ్వార్ ఉత్సవమూర్తుల ఊరేగింపు ప్రారంభమైంది. తిరుపతి వీధుల గుండా కపిలతీర్థానికి చేరుకున్న అనంతరం అక్కడ తిరుమంజనం, ఆస్థానం నిర్వహించారు. అక్కడినుంచి బయల్దేరి పీఆర్ గార్డెన్ మీదుగా మధ్యాహ్నం తిరిగి ఆలయానికి చేరుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa