ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పార్టీలు అనేక హామీలు గుప్పిస్తుంటాయి. అధికారంలోకి వచ్చాక సంగతి దేవుడెరుగు.. ముందు పవర్లోకి వస్తే ఆ తర్వాత చూసుకుందాం అన్నట్లుగా ఉంటుంది పార్టీల తీరు. ఇదీ అదీ అని కాదు కానీ.. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో అన్నిపార్టీలదీ అదే దారి.. అధికారమే పరమావధి. ఓట్ల కోసం పార్టీల అభ్యర్థులు ఇంట్లోకి వచ్చి పాత్రలు అడుగుతారు.. ఇంట్లో ఉన్న బుడ్డోడికి స్నానం కూడా చేయిస్తుంటారు. ఇక ఆ పార్టీ అంతచేస్తే.. మేము అధికారంలోకి వస్తే అంతకుమించి చేస్తామనే చెప్పే కహానీలు వీటికి అదనం. ఇప్పుడు ఇలాంటి ఘటనే సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతోంది.
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడింది. మహా అంటే మరో రెండు, రెండున్నర నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక మీద కుర్చీ మడత పెట్టి మరీ కూర్చున్నాయి. అక్కడ ఎవడు గెలుస్తాడు, ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే విజయలక్ష్మి వరిస్తుందనే లెక్కల్లో మునిగి తేలుతున్నాయి. పార్టీల అధిష్ఠానాలు ఈ లెక్కల్లో బిజీగా ఉంటే.. గ్రౌండ్ లెవల్లో పార్టీల కార్యకర్తలకు ఇంటింటికీ వెళ్లి తలుపు తడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకే ఓటేయాలని, తాము అధికారంలోకి వస్తే అవి చేస్తాం, ఇవి చేస్తామంటూ ఓట్ల కోసం వీలైనన్ని ఫీట్లు చేస్తున్నాయి. అలాంటి ఘటనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇది ఎక్కడ జరిగిందనేదీ క్లారిటీ లేదుకానీ.. ఇద్దరు మహిళా కార్యకర్తలు మాత్రం ఓ వృద్ధురాలిని ఓట్లు అడగడం కనిపించింది.
ఏపీలో జగన్ ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు నెలనెలా పింఛన్ అందిస్తోంది. ఈ మధ్యనే పింఛన్ మొత్తాన్ని కూడా పెంచారు. ఇక ప్రజలకు ఇంటివద్దకే పౌరసేవలు అందేలా వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను ఏర్పాటు చేసింది. యాభై ఇళ్లకో వాలంటీరును ఏర్పాటు చేసి పింఛన్లు అందిస్తోంది. ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయం ఆరింటికే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందిస్తున్నారు వాలంటీర్లు. ఈ నేపథ్యంలోనే వృద్ధురాలిని ఓటు అడగడానికి వచ్చిన విపక్షాలకు చెందిన మహిళా కార్యకర్తలు.. వచ్చే ఎన్నికల్లో తమకే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
ప్రస్తుతం వాలంటీర్లు ఆరు గంటలకు పింఛన్ డబ్బులు ఇస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే ఐదున్నరకే ఇంటికి వచ్చి పింఛన్ డబ్బులు అందిస్తామని హామీ ఇస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజనం భిన్నంగా స్పందిస్తున్నారు. ఇదెక్కడి గోలరా అయ్యా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరేమో పార్టీల వ్యవహారం చూస్తే నిద్రకూడా పోనిచ్చిటట్టు లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa