ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ వైఖరిని తప్పుబడుతూ బహిరంగ లేఖ రాశారు గోనె ప్రకాశ్ రావు. వైఎస్ఆర్ కుటుంబంతో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందన్న గోనె ప్రకాశ్ రావు.. ప్రస్తుత పరిణామాలతో ఆ మహానేత పేరుకు భంగం కలుగుతోందని చెప్పుకొచ్చారు. ఆ ఆవేదనతోనే బహిరంగ లేఖ రాశానన్నారు. వైఎస్ఆర్ ముద్దుబిడ్డ అయిన షర్మిల మీద విషప్రచారాన్ని భరించలేక లేఖ రాస్తున్నట్లు చెప్పుకొచ్చారు. షర్మిలపై జరుగుతున్న ప్రచారంలో జగన్ హస్తం కూడా ఉందని ఆరోపించారు.
" నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ.. తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ... తెలుగు రాష్ట్రాల్లో బహుళ ప్రాచుర్యం పొందిన ఈ సినిమా పాట మీరు వినే ఉంటారు. మీ కోసం, వైఎస్ఆర్సీపీ కోసం కాళ్లు బొబ్బలెక్కేటట్టు సుదీర్ఘ పాదయాత్ర చేసిన మీ చెల్లెలు శ్రీమతి షర్మిలపై మీరు కనీసం ప్రేమానురాగాలు చూపగాపోగా.. ఆమెపై దుష్ప్రచారం చేయడానికి మీరే కుట్రలు, కుతంత్రాలు పాల్పడడం క్షమించరాని నేరం. తోబుట్టువు, ఇంటి ఆడబిడ్డ కంటనీరు పెట్టడం మీకు, మీ కుటుంబానికి మంచిది కాదు. కనీసం ఇప్పటికైనా మీ తోబుట్టువు శ్రీమతి షర్మిలపైన మీరు, మీ సన్నిహితులు మీ సోషల్ మీడియా, మీ సొంత మీడియా ద్వారా చేస్తున్న దుష్ప్రచారాన్ని నిలిపివేయాలని వైఎస్ఆర్ కుటుంబం శ్రేయోభిలాషిగా మీకు నేను హితవు చెబుతున్నాను" అని ప్రకాశ్ రావు లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం వైఎస్ జగన్ అనుభవిస్తున్న అధికారం షర్మిల పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టడం వలనే వచ్చిందన్న గోనె ప్రకాశ్ రావు.. అంతరాత్మను ప్రశ్నించుకుంటే వాస్తవాలు తెలుస్తాయన్నారు. వైఎస్ఆర్ మరణానంతరం జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో జగన్ విస్తృతంగా ప్రచారం చేశారన్న గోనె ప్రకాశ్ రావు.. ప్రచారం చేసిన చోట్ల ఎన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది? ప్రతిపక్ష నేతగా మీరు దాదాపు పదిహేను రోజుల పాటు నంద్యాల ఉప ఎన్నికల్లో గడప గడపకు వెళ్లి ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ 25 వేల ఓట్ల పైచిలుకుతో గెలుపొందిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
షర్మిలపై విషప్రచారం ఆపకుంటే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని గోనె ప్రకాశ్ రావు హెచ్చరించారు. సజ్జల లాంటి వ్యక్తి సలహాలతో తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఏపీలో జగన్ కు ప్రతిపక్ష హోదాకూడా దక్కదని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని అనుచరులతో షర్మిలపై చేస్తున్న దుష్ర్పచారాన్ని నిలిపివేయాలని కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa