ఏపీ సీఐడీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. వీరిలో ఏ1గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి పి నారాయణ, హెరిటేజ్ ఫుడ్స్కు డైరెక్టర్గా వ్యవహరించిన నారా లోకేష్, వ్యాపారవేత్త లింగమనేని రమేష్, ఆయన సోదరుడు రాజశేఖర్లను ప్రధాన నిందితులుగా ఛార్జిషీట్లో పేర్కొన్నారు. చంద్రబాబు, నారాయణ ఏపీ సీఆర్డీఏకి ఎక్స్అఫీషియో ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా వ్యవహరిస్తూ సింగపూర్ ప్రభుత్వానికి, ఏపీకి మధ్య అవగాహన ఒప్పందం జరిగిందని మంత్రిమండలికి, ప్రభుత్వానికి తప్పుగా చూపారన్నారు.. అలాంటి ఒప్పందం జరగలేదన్నారు.
కేంద్రం నుంచి ఆ ఒప్పందానికి అనుమతి తీసుకోలేదన్నారు. నామినేషన్ ప్రాతిపదికన విదేశీ మాస్టర్ప్లానర్ సుర్బానా జురాంగ్ను అక్రమ మార్గంలో నియమించారన్నారు. చట్టవిరుద్ధంగా రుసుము రూపంలో ఆ సంస్థకు కోట్ల రూపాయలు చెల్లించారన్నారు. రింగ్రోడ్డు, స్టార్టప్ ఏరియా మాస్టర్ప్లాన్ను నిందితులకు అనుకూలంగా, తమకు చెందిన సమీప భూములకు దగ్గరగా రూపొందించుకున్నారన్నారు. మాజీమంత్రి నారాయణ సొమ్ము పెట్టుబడిగా పెట్టి బంధువుల పేరున 58 ఎకరాలు కొన్నారన్నారు. సీడ్ క్యాపిటల్ ఏరియాను ఈ భూములకు సమీపంలో డిజైన్ చేశారని.. కేపిటెల్ సిటీ ఏరియాలోని ఇతర ప్రాంతాల కంటే ముందుగా ప్రజాధనం రూ 5500 కోట్లతో సీడ్ క్యాపిటల్ ఏరియాను అభివృద్ధి చేస్తామని కమిట్మెంట్ ఇచ్చారన్నారు.
తమ భూముల విలువ పెరిగేలా చేసినందుకు క్విడ్ ప్రోకోలో భాగంగా వ్యాపారవేత్త లింగమనేని రమేష్.. చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులకు అద్దె లేకుండా ఇంటిని బహుమతిగా ఇచ్చారన్నారు. ఇన్నర్ రింగ్రోడ్డు డిజైన్ చేసిన స్థలానికి పక్కనే హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ 14 ఎకరాలు కొనుగోలు చేసిందన్నారు. ఈ ఘటనలు ఐపీసీ సెక్షన్ 120(బి), 409, 420, 34, 35, 36, 37 అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(2) రెడ్విత్ 13(1) సీ, డీ కింద శిక్షార్హం అని పేర్కొన్నారు. ఈ ఛార్జిషీట్ను సీల్డ్కవర్లో ఏసీబీ కోర్టుకు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa