అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీలో వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చారు సీఎం జగన్. పౌరసేవలను ప్రజల ఇళ్లవద్దకే చేర్చాలనే ఉద్దేశంతో సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్ను నియమించారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల లబ్ధిని ఈ వాలంటీర్లు అర్హులకు చేరవేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వాలంటీర్లకు వందనం పేరుతో వారిని ప్రభుత్వం సత్కరిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని వాలంటీర్లకు సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పేరుతో అవార్డులు, నగదు పురస్కారం అందిస్తోంది. ఇప్పటి వరకూ మూడుసార్లు వీటిని అందించగా.. నాలుగో ఏడాది గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం వేదికగా ఫిబ్రవరి 15న సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అత్యుత్తమ సేవలు అందించిన.. మొదటి ఐదు మంది వాలంటీర్లను సేవా వజ్ర పేరుతో సత్కరిస్తారు. వారికి 30 వేల రూపాయల నగదు బహుమతితో పాటు సర్టిఫికేట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్ అందిస్తారు. మొత్తం 175 నియోజకవర్గాల పరిధిలో 875 మందికి సేవావజ్ర పురస్కారాలు అందిస్తారు. ఇక రెండో విభాగమైన సేవా రత్న కింద ప్రతి మున్సిపాలిటీ, మండలం పరిధిలో అత్యుత్తమ సేవలు అందించిన ఐదుగురు వాలంటీర్లను, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పదిమంది వాలంటీర్లను గుర్తించి, వారికి 20 వేల నగదు బహుమతి, సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్తో సత్కరిస్తారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 4220 మంది వాలంటీర్లకు సేవారత్న అవార్డు అందిస్తారు. ఇక మూడో విభాగమైన సేవా మిత్ర కింద రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 2 లక్షల మందికి పైగా వాలంటీర్లకు పదివేల రూపాయల నగదు బహుమతి అందిస్తారు. అలాగే సర్టిఫికేట్, మెడల్, శాలువా, బ్యాడ్జ్లతో సత్కరిస్తారు. అయితే ఏడాది పాటు ప్రజల నుంచి ఎలాంటి కంప్లైంట్స్ రాని వాలంటీర్లకు సేవామిత్ర కింద అవార్డులు అందిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa