ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల వెళ్లేవారికి ఆ రోజుల్లో ఎంబీసీ, టీబీ కౌంటర్లు బంద్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 13, 2024, 06:52 PM

సూర్యజయంతి సందర్భంగా ఫిబ్రవరి 16న తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. వేడుకల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమి సందర్భంగా అర్ధ బ్రహ్మాత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఒకేరోజు స్వామివారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారనీ, అందుకే దీనిని అర్ధ బ్రహ్మాత్సవం అంటారని పండితులు చెబుతున్నారు. మరోవైపు రథసప్తమి సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.


ఎండలు పెరిగిన నేపథ్యంలో భక్తులు ఎండకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అఖిలాండం వద్ద, మాడవీధుల్లో షెడ్లు ఏర్పాటు చేశారు. అలాగే మాడవీధుల్లో కూల్ పెయింట్ వేశారు. రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దారు. ఇక గ్యాలరీల్లోని భక్తుల కోసం సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, పొంగల్ తదితర అన్నప్రసాదాలు.. తాగునీరు, మజ్జిగ, టీ, కాఫీ, పాలు పంపిణీ చేయనున్నారు.


ప్రత్యేక దర్శనాలు రద్దు


రథసప్తమి సందర్భంగా ఫిబ్రవరి 16న ప్రోటకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు రద్దుచేశారు. సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 15 నుంచి 17 వరకూ తిరుప‌తిలోని కౌంటర్లలో సర్వదర్శనం టోకెన్ల జారీ ఉండ‌దు. భ‌క్తులు నేరుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2 ద్వారా శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌చ్చని టీటీడీ తెలిపింది. అలాగే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం భ‌క్తులు నిర్దేశించిన టైంస్లాట్‌లను పాటించకపోతే టోకెన్ లేని భక్తులతో కలిపి వైకుఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా దర్శనం చేసుకోవచ్చని తెలిపింది.


గదుల కేటాయింపు ఎలా


ఫిబ్రవరి 14 నుంచి 16వ తేదీ వరకూ గ‌దుల‌ కేటాయింపు కోసం సిఆర్వో జనరల్ కౌంటర్లు మాత్రమే పనిచేస్తాయని టీటీడీ తెలిపింది. ఈ రోజుల్లో ఎంబిసి, టిబి కౌంటర్లను మూసివేస్తారు. కౌంట‌ర్లలో 4 లక్షల లడ్డూలతో పాటు అద‌నంగా మ‌రో 4 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా ఉంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దుచేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.


మరోవైపు రథసప్తమి సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తుల కోసం చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను టీటీడీ సీవీఎస్‌వో నరసింహ కిషోర్, తిరుపతి జిల్లా ఎస్పీ మలికా గార్గ్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. భ‌క్తులు గ్యాల‌రీల్లోకి వెళ్లేందుకు, తిరిగి వెలుప‌లికి వ‌చ్చేందుకు ఏర్పాటు చేసిన మార్గాల‌ను త‌నిఖీ చేశారు. మాడ వీధుల‌తోపాటు భ‌క్తుల ర‌ద్దీ ఉన్న ప్రాంతాల్లో చేప‌ట్టాల్సిన భద్రతా చర్యలపై విజిలెన్స్‌, పోలీసు అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. తిరుమ‌ల‌లో ట్రాఫిక్ ఇబ్బందులు త‌లెత్తకుండా చర్యలు చేప‌ట్టాల‌ని, పార్కింగ్ ప్రదేశాలకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల‌ని తెలియ‌జేశారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa