వీల్ చైర్ అందుబాటులో లేకపోవడం.. ఓ 80 ఏళ్ల వృద్ధుడి ప్రాణాలను బలిగొంది. ఎయిర్పోర్టులో ఆ వృద్ధుడి కోసం వీల్చైర్ను సదరు ఎయిర్లైన్స్ సంస్థ ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని వృద్ధుడి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. విమానం దిగిన వెంటనే.. వీల్ చైర్ అక్కడ లేకపోవడంతో దాదాపు 1.5 కిలోమీటర్ల దూరం నడిచిన ఆ వృద్ధుడు.. ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్దకు వెళ్లి అక్కడే కూలి చనిపోయాడు. అయితే తనకు వీల్ చైర్ కావాలని విమాన టికెట్ బుక్ చేసుకునే ముందే ఆ వృద్ధుడు బుక్ చేసుకోగా.. సమయానికి అక్కడ ఎయిర్ ఇండియా సంస్థ వీల్ చైర్ అందుబాటులో ఉంచలేదు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి చూడటం మరిన్ని విమర్శలకు తావిస్తోంది.
మహారాష్ట్ర రాజధాని ముంబై ఎయిర్పోర్టులో ఈ విషాదకర ఘటన జరిగింది. అమెరికాలో నివసించే ఓ ప్రవాస భారతీయుడు తన భార్యతో కలిసి న్యూయార్క్ నుంచి ముంబైకి ఈ నెల 12 వ తేదీన వచ్చాడు. 80 ఏళ్ల ఆ వృద్ధుడు ఎయిర్ ఇండియా విమాన టికెట్ బుక్ చేసుకోగా.. బుక్ చేసుకునే సమయంలోనే తనకు, తన భార్యకు ఇద్దరికీ వీల్ చైర్ సౌకర్యం కావాలని పేర్కొన్నాడు. అయితే వారిద్దరూ విమానం దిగేసరికి అక్కడ తగినన్ని వీల్ చైర్లు అందుబాటులో లేకపోవడంతో ఇద్దరికీ కలిపి ఒకటే వీల్ చైర్ ఇచ్చారు. ఆ వీల్ చైర్లో తన భార్యను కూర్చొబెట్టిన వృద్ధుడు తాను నడవడం ప్రారంభించాడు.
అయితే విమానం దిగిన చోటు నుంచి దాదాపు 1.5 కిలోమీటర్లు ఆ వృద్ధుడు నడవగా.. అతని భార్య వీల్ చైర్లో వచ్చింది. చివరికి ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్దకు రాగానే ఆ వృద్ధుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన ఎయిర్పోర్టు సిబ్బంది, తోటి ప్రయాణికులు.. వెంటనే ఆ వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు డాక్టర్లు గుర్తించారు. అయితే ఆ వృద్ధుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు. అయితే ముందే బుక్ చేసుకున్నా.. విమానం దిగేసరికి ఆ వృద్ధుడికి వీల్ చైర్ అందుబాటులో ఉంచని.. ఎయిర్ ఇండియా సంస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే వీల్ చైర్ అందుబాటులో లేక వృద్ధుడు మృతి చెందిన ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటన చాలా దురదృష్టకరమని పేర్కొంది. అయితే ఆ రోజు వీల్ఛైర్లు వినియోగించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో వాటికి డిమాండ్ ఎక్కువ అయిందని.. అయితే వీల్ చైర్ ఏర్పాటు చేసేవరకు ఎదురుచూడాలని తమ సిబ్బంది ఆ ప్రయాణికుడికి చెప్పినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. కానీ ఆ వృద్ధుడు తన భార్య వెంటే నడుచుకుంటూ వెళ్తానని చెప్పినట్లు వివరించింది.
ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులతో తాము మాట్లాడుతున్నామని.. వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని ఎయిరిండియా సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ రోజు న్యూయార్క్ నుంచి ముంబై వచ్చిన ఆ ఎయిర్ ఇండియా విమానంలో 32 మంది ప్రయాణికులు వీల్ చైర్ బుక్ చేసుకున్నట్లు ముంబై ఎయిర్పోర్టు వర్గాలు తెలిపాయి. అయితే ఎయిర్పోర్టు గ్రౌండ్ సిబ్బంది వద్ద కేవలం 15 వీల్ చైర్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో మిగితా వారికి అవి దొరకలేదని పేర్కొన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa