మన దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగ మార్గం జమ్మూలో ప్రారంభం అయింది. ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ రైల్వే టన్నెల్ను ప్రారంభించారు. ఈ టన్నెల్ జమ్మూ కాశ్మీర్లో అందుబాటులోకి వచ్చింది. ఉధంపుర్- శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 48.1 కిలోమీటర్ల పొడవైన బనిహాల్-ఖడీ-సుంబడ్-సంగల్దాన్ సెక్షన్లో ఈ సొరంగం ఉంది. ఈ మార్గంలోనే ఖడీ-సుంబడ్ల మధ్య ఈ టీ-50 సొరంగం ఉంటుంది. ఈ టీ-50 రైల్వే టన్నెల్ పొడవు 12.77 కిలోమీటర్ల పొడవు ఉంది.
బారాముల్లా- శ్రీనగర్- సంగల్దాన్ మార్గంలో రెండు విద్యుత్ రైళ్లకూ జమ్మూ నుంచి వర్చువల్గా పచ్చజెండా ఊపి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇక కాశ్మీర్ లోయలో ఎలక్ట్రిక్ రైళ్లను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ఉధంపుర్- శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్లో 11 టన్నెల్లు ఉండగా.. ఈ టీ-50 రైలు సొరంగం అత్యంత పొడవైంది కావడం గమనార్హం.
అయితే ఈ సొరంగం నిర్మాణ పనులు 2010 లో ప్రారంభమయ్యాయి. అప్పటి యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ టన్నెల్ పనులు పూర్తయ్యేందుకు 14 సంవత్సరాలు పట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అత్యవసర పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు T-50 టన్నెల్కు సమాంతరంగా ఒక ఎస్కేప్ టన్నెల్ నిర్మించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. సొరంగం లోపల అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ 12.77 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ టన్నెల్లో ప్రతీ 375 మీటర్ల వద్ద ఎస్కేప్ టన్నెల్కు కనెక్టింగ్ పాస్ నిర్మించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ఈ టీ-50 రైల్వే టన్నెల్లో ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే అందులోని ప్రయాణికులు ఎస్కేప్ టన్నెల్ ద్వారా బయటికి వచ్చి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బయటపడవచ్చని రైల్వే అధికారులు వివరించారు. ఇక అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు వెంటనే మంటలను ఆర్పేందుకు సొరంగానికి రెండు వైపులా వాటర్ పైప్లు కూడా ఏర్పాటు చేశారు. టన్నెల్ లోపల ప్రతీ 375 మీటర్లకు ఒక ఓపెనింగ్ వాల్వ్ను అమర్చారు. బనిహాల్-సంగల్దాన్ సెక్షన్ ప్రారంభమైతే కాశ్మీర్ లోయ నుంచి కన్యాకుమారి వరకు రైలును నడపాలనే ఆశయానికి బాటలు వేసినట్లు అవుతుందని ఉత్తర రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు.
ఈ ఉదంపూర్ ఉదంపూర్- శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టును రూ.41 వేల కోట్లతో చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం పొడవు 272 కిలోమీటర్లు కాగా.. ప్రస్తుతం బారాముల్లా- సంగల్దాన్, ఉధంపుర్- కాట్రా సెక్షన్ల మధ్య రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాట్రా- సంగల్దాన్ల మధ్య 63 కిలోమీటర్ల మేర పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి అయిన చీనాబ్ వంతెన, దేశంలో తొలి తీగల రైలు వంతెన అంజీఖాడ్ ఈ మార్గంలోనే ఉండటం మరో విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa