ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీల మధ్య నేతల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని టీడీపీలో చేరారు.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో కొలుసు పార్థసారథి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు సైకిల్ పార్టీలో చేరిపోయారు. పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థసారథిని ఇప్పటికే టీడీపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీలో చేరకముందే ఆయనను నూజివీడు ఇంఛార్జిగా నియమించిన చంద్రబాబు.. తొలిజాబితాలోనే ఆయనను నూజివీడు అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించారు.
మరోవైప పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థసారథిని మరోసారి అక్కడి నుంచి బరిలో నిలిపేందుకు వైసీపీ అధిష్టానం ఇటీవల తిరస్కరించింది. ఆయన స్థానంలో జోగి రమేష్ను పెనమలూరు ఇంఛార్జిగా ప్రకటించింది. దీంతో వైసీపీకి రాజీనామా చేసిన కొలుసు పార్థసారథి టీడీపీలో నూజివీడు టికెట్ దక్కించుకున్నారు. అయితే వైసీపీ విధానాలు నచ్చకే ఆ పార్టీని వీడినట్లు పార్థసారథి తెలిపారు. వైసీపీ విధానాలతో భవిష్యత్తు ఉండదని గ్రహించే ఆ పార్టీని వీడినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వైసీపీలో ప్రాధాన్యం లేదన్న పార్థసారథి.. చంద్రబాబు విజన్తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు. పార్థసారథితోపాటు వైసీపీ నేతలు బొప్పన భవకుమార్, కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ చంద్రశేఖర్ టీడీపీలో చేరారు.
మరోవైపు రెండురోజుల్లో తాను కూడా టీడీపీలో చేరనున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రకటించారు. సోమవారం అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన వసంత కృష్ణప్రసాద్.. కార్యకర్తలతో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లనున్నట్లు చెప్పారు. ఆయన సమక్షంలోనే టీడీపీలో చేరతానని వెల్లడించారు. మైలవరం టీడీపీ ఇంఛార్జి దేవినేని ఉమాతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవన్న వసంత కృష్ణప్రసాద్.. చంద్రబాబు సమక్షంలోనే అన్ని విషయాలు చర్చించుకుంటామని చెప్పారు. అయితే వైసీపీ కూడా తనకు మైలవరం టికెట్ ఇస్తామని చెప్పిందనీ, అయితే చంద్రబాబు, లోకేష్ మీద వ్యక్తిగత దూషణలు చేయమని చెప్పిందన్నారు. దీంతో ఆ పార్టీలో ఉండలేక రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చారు.
వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరనున్న నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమాను పెనమలూరు పంపించే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐవీఆర్ఎస్ సర్వేలు సైతం చేస్తున్నట్లు తెలిసింది. అయితే పెనమలూరు ఇంఛార్జి బోడె ప్రసాద్ తనకే టికెట్ కావాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇక నర్సరావుపేట వైసీపీ ఎంపీ సైతం సైకిల్ పార్టీలో చేరనున్నారు. ఇదే విషయాన్ని లావు శ్రీకృష్ణదేవరాయలు ఓ లేఖలో వెల్లడించారు. ఇటీవలే లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేశారు. అయితే మళ్లీ ఆయన వైసీపీ గూటికి వెళ్లనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బహిరంగ లేఖ రాసిన లావు శ్రీకృష్ణదేవరాయలు.. త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు వెల్లడించారు.ఐదేళ్లుగా నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలు తనపై చూపించిన ప్రేమ, అభిమానం మరువలేనిదని లేఖలో పేర్కొన్నారు. తన తదుపరి రాజకీయ కార్యాచరణ గురించి అందరూ అడుగుతున్నారనీ.. పల్నాడు అభివృద్ధి కోసం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు.త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నానని క్లారిటీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa