ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కంటైనర్‌ను ఆపిన పోలీసులు.. ఆపకుండా జంప్, ఛేజ్ చేసి పట్టుకుని చెక్ చేస్తే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2024, 08:02 PM

శ్రీకాకుళం జిల్లాలో, విశాఖలో రోడ్డుపై పోలీసుల ఛేజింగ్ సీన్ కనిపించింది. ఓ కంటైనర్‌ను పట్టుకునేందుకు పోలీసులు వెంబడించారు. చెన్నై నుంచి వచ్చిన కంటైనర్‌.. ఒడిశా నుంచి గంజాయి లోడింగ్‌ చేసుకుని వస్తున్నట్లు శ్రీకాకుళం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు ముందుగానే సమాచారం వచ్చింది. వెంటనే పలాస సమీపంలోని నెమలి నారాయణపురం హైవేపై పోలీసులు నిఘా పెట్టారు. ఇంతలో కంటైనర్‌ రావడంతో ఆపారు.. లోపల తనిఖీ చేయాలని వాహనాన్ని పక్కన ఆపాలని డ్రైవర్‌కు చెప్పారు. అతడు తప్పించుకోవడానికి ఒక్కసారిగా కంటైనర్‌ను ముందుకు పోనిచ్చాడు.. పోలీసులు పక్కకు దూకేయడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి.


ఆ వెంటనే గాయపడిన ముగ్గుర్ని చికిత్స నిమిత్తం వీరిని శ్రీకాకుళం తరలించారు. కంటైనర్‌ అక్కడి నుంచి తప్పించుకోవడంతో విశాఖ ఆనందపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు.. వెంటనే భీమిలి క్రాస్‌ రోడ్డు దగ్గర వాహనం కోసం నిఘా ఉంచారు. అక్కడా ఈ కంటైనర్‌ ఆగకుండా ముందుకు దూసుకుపోయింది. పోలీసులు వెంబడించడంతో వాహనాన్ని వదిలేసి డ్రైవర్‌, క్లీనర్ పారిపోయాడు. స్వాధీనం చేసుకున్న కంటైనర్‌ను ఆనందపురం పోలీసుస్టేషన్‌కు తరలించి పరిశీలించగా పొక్లెయిన్‌ విడి భాగాలతో పాటు 13 గోనె సంచుల్లో 386 కిలోల మేర 80 ప్యాకెట్ల గంజాయిని గుర్తించారు. కంటైనర్‌ డ్రైవర్, క్లీనర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.


ఈ ఘటనలో ఎస్‌ఐ ప్రభాకర్‌ కాలు, చేతికి గాయాలయ్యాయి. కానిస్టేబుళ్లు సంతోష్‌ చేతికి, సురేష్‌ కాలుకి గాయాలయ్యాయి. ఈ ముగ్గురూ తలకు హెల్మెట్లు ధరించడం వలనే ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని డాక్టర్లు తెలిపారు. ఒడిశా ప్రాంతం నుంచి ఏపీ మీదుగా గంజాయి అక్రమ రవాణా కొనసాగుతోంది. ఈ క్రమంలో పోలీసులు నిఘా పెంచారు.. కొంతకాలంగా పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు రైల్వేస్టేషన్లలో బ్యాగుల్లో తరలిస్తున్న గంజాయి నిల్వలు పట్టుబడ్డాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa