మార్చి ఏడో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ) నిర్ణయించింది. ఈ మేరకు గురువారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించనుంది. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకురాలు శ్రీమతి అనంతలక్ష్మి నందివాడ, ప్రముఖ గాత్ర సంగీత విద్వాంసురాలు శ్రీమతి ద్వారం లక్ష్మి, మృదంగం వాయించడంలో తొలిసారిగా పద్మశ్రీ అవార్డు పొందిన శ్రీమతి సుమతి నిడుమోలు, ఆసియా గేమ్స్లో కాంస్యపతకాన్ని గెలుచుకున్న నందిని ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు.
మరోవైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులను సత్కరించాలని టీటీడీ నిర్ణయించింది. ఇన్నిరోజులు చేసిన సేవలకు గుర్తింపుగా.. త్వరలోనే ఉద్యోగ విరమణ చేయనున్న 60 మంది మహిళా ఉద్యోగులను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీటీడీ సత్కరించనుంది. ఈ విషయాన్ని ప్రకటనలో తెలియజేసింది. అలాగే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం తిరుపతిలోని ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో మహిళా ఉద్యోగులకు వ్యాసరచన, డ్రాయింగ్, క్విజ్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.
శ్రీశైలం మల్లన్నకు శ్రీవారి తరుఫున పట్టు వస్త్రాలు
మరోవైపు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా.. తిరుమల శ్రీవారి తరపున టీటీడీ ఈవో ధర్మారెడ్డి సోమవారం సాయంత్రం పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే టీటీడీ తరుఫున ఈవో ధర్మారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఈవోకు శ్రీశైలం ఆలయ చైర్మన్ చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ అధికారులు వీరికి తీర్థ, ప్రసాదాలు అందించారు. శ్రీశైలంలో మార్చి ఒకటో తేదీన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మార్చి 11వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa