ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సచివాలయం తాకట్టుపెట్టకూడదని రాజ్యాంగంలో రాసుందా?: కొడాలి నాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2024, 07:54 PM

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని ఫైరయ్యారు. సచివాలయం తాకట్టుపెట్టారంటూ ఓ గగ్గోలు పెడుతున్నారన్న కొడాలి నాని.. ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం డబ్బులు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపెట్టడం మామూలేనన్నారు. ఆ తర్వాత డబ్బులు చెల్లించి విడుదల చేయించుకుంటుందని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాకట్టు పెట్టకుండా బ్యాంకులు లోన్లు ఇస్తాయా అని ప్రశ్నించిన కొడాలి నాని.. ఫలానావి మాత్రమే తాకట్టుపెట్టాలంటూ రాజ్యాంగంలో ఏమైనా రాసుందా అంటూ ప్రశ్నించారు.


"ఈ రాష్ట్రానికి రూ.4 లక్షల కోట్లు అప్పులున్నాయి. అందులో రూ.2.50 లక్షల కోట్లు చంద్రబాబు చేశారు. రూ.2లక్షల కోట్లు అప్పు జగన్ ప్రభుత్వ హయాంలో జరిగింది. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులు అప్పులిస్తాయా? ఫలానా తాకట్టు పెట్టాలి, ఫలానాది తాకట్టు పెట్టకూడదని అంబేద్కర్ గారు ఏమైనా రాజ్యాంగంలో రాశారా? సెక్రటేరియట్ ఏమైనా చంద్రబాబుదా? అది ప్రభుత్వానిది. ప్రభుత్వానికి డబ్బులు అవసరమైనప్పుడు, ప్రజలకు అవసరమైనప్పుడు బ్యాంకులో తాకట్టుపెట్టి డబ్బులు తెచ్చుకుంటారు. తర్వాత డబ్బులు చెల్లించి రిలీజ్ చేసుకుంటారు. చంద్రబాబు తాకట్టుపెట్టినవే తాకట్టుపెట్టాలా? రాజ్యాంగంలో రూల్ ఏమైనా ఉందా? ప్రభుత్వానికి ఉన్న వెసలుబాటును పెట్టి తాకట్టుపెడతారు. సెక్రటేరియట్ పది ఎకరాల పొలం. ఎకరా రెండు కోట్లు వేసుకున్నా రూ.20 కోట్ల ఆస్తి. చంద్రబాబుది చిల్లర రాజకీయం. గతంలో ఆయనేమీ తాకట్టుపెట్టలేదా?" అంటూ కొడాలి నాని ప్రశ్నించారు.


మరోవైపు రూ.370 కోట్ల అప్పు కోసం ఏపీ ప్రభుత్వం సచివాలయాన్ని తాకట్టు పెట్టిందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. సచివాలయం తాకట్టు పెట్టి అప్పులు తేవడం ఏపీకి అవమానం అంటూ ట్వీట్ చేశారు. జగన్ తాకట్టుపెట్టింది భవనాలను కాదు తెలుగువారి ఆత్మగౌరవాన్ని అంటూ ఎక్స్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే సచివాలయాన్ని తాకట్టుపెట్టలేదని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి వార్తలు రాసినవారి మీద చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు.


ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆరోపణలపై.. మాజీ మంత్రి కొడాలి నాని ఓ రేంజులో ఫైరయ్యారు. సచివాలయం తాకట్టుపెట్టకూడదని రూల్ ఏమైనా ఉందా అని ప్రశ్నించిన కొడాలి నాని.. అదేమైనా చంద్రబాబు సొంత ఆస్తా అంటూ విరుచుకుపడ్డారు. ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపెట్టడం, తిరిగి తెచ్చుకోవడం మామూలేనని వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa