ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త.. మంచి ఛాన్స్, మరికొద్దిరోజులు మాత్రమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 05, 2024, 08:47 PM

ఏపీలో రేషన్ పంపిణీ కొనసాగుతోంది. ఈ నెల 1 నుంచి రేషన్ సరుకులతో పాటుగా రాగి పిండిని కూడా పంపిణీ చేస్తున్నారు. మార్కెట్‌తో పోలిస్తే చాలా తక్కువ ధరకే రాగి పిండిని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా ఈనెల నుంచి తెల్లరేషన్‌ కార్డుదారులకు రాగిపిండి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో కార్డుదారుడికి కిలో రూ.11 చొప్పున అందిస్తోంది. ప్రజలకు పోషక విలువలతో కూడిన ఆహారం అందించడం లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది.


అందుకే రాగులు, జొన్నలు సరఫరా చేస్తోంది.. కుటుం బం మూడు కేజీల వరకు రాగులు తీసుకుంటే, వారి కోటాలో ఇచ్చే బియ్యంలో అంతే మొత్తం తగ్గిస్తారు. తాజాగా రాగిపిండిని ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేస్తోంది. మార్కెట్‌లో రాగి పిండి కిలో రూ.30 నుంచి రూ.40 వరకు ఉండగా.. రూ.11లకే రాగిపిండి ప్యాకెట్లను విక్రయిస్తోంది. ఒక కిలో రాగిపిండి కొనుగోలు చేసిన కార్డుదారులకు కిలో బియ్యం తగ్గిస్తారు. కొందరు రాగి పిండి తీసుకుంటుండగా.. మరికొందరు తమకు రాగి పిండి వద్దు బియ్యమే కావాలి అంటున్నారు. కొందరు కిలో బియ్యం తగ్గించి ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారట. ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్నవారికి కందిపప్పు కూడా పంపిణీ చేస్తోంది.


రేషన్ పంపిణీ కొనసాగుతుండగా.. కార్డులు ఉన్నవారి రాగి పిండిని కూడా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంటింటికి రేషన్‌ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎండీయూ వాహనం వద్ద కార్డుదారులు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ముందుగా ఈ రాగి పిండి పంపిణీని ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చేపట్టారు.. ఆ తర్వాత మిగిలిన జిల్లాల్లో పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. రాగి పిండిని ముందుగా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. రాయలసీమలోని అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోను రాగి పిండి పంపిణీ చేస్తోంది.


ఇప్పటి వరకు ఏపీలో ఒక్కో రేషన్‌ కార్డు మీద గతంలో బియ్యం, కందిపప్పు, రాగులు/జొన్నలు, గోధుమ పిండి కూడా అందిస్తున్నారు. రేషన్‌కార్డుదారులు వాటిని మిల్లింగ్‌ చేసుకుని వినియోగించుకుంటున్నారు. అయితే ప్రభుత్వం రాగి పిండి పంపిణీ చేయడం వల్ల లబ్దిదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది అంటున్నారు. అంతేకాదు ఈ రాగుల్ని కూడా రైతుల నుంచే సేకరిస్తున్నారు. ఇలా చేస్తే రేషన్‌ కార్డు లబ్ధిదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించడమే కాక.. స్థానిక రైతులకు సాయం చేయడం కోసం పౌరసరఫరాల సంస్థ రాగులు, జొన్నల్ని కొనుగోలు చేస్తోంది. అలానే చిరుధాన్యాల సాగు, వినియోగం పెంచడానికి ఆ దిశగా రాష్ట్రప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa