ఏపీ ప్రజలను వాతావరణశాఖ అలర్ట్ చేసింది. ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో ఈనెల నుంచే మే వరకు అధిక ఉష్ణోగ్రతలతోపాటు వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. భారత వాతావరణ సంస్థ హెచ్చరించిందని.. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో ఆయన సూచించారు. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు.
అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించే అవకాశం ఉంటుందని.. అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు.
గర్బిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. వేసవిలో ఓఆర్ఎస్, మజ్జిగ, మంచినీరు వంటివి అధికంగా సేవించాలని సూచించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి రియల్ టైమ్లో ముందుగానే ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల తీవ్రతపై సూచనలు జారీ చేస్తామన్నారు. ఎండలు, వడగాల్పులు, పిడుగుల సమాచారం కోసం 24 గంటలూ అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101ను సంప్రదించాలని సూచించారు.
ఎండలు, వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాలపై అధికారులు దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఎండలతోపాటు క్యుములోనింబస్ మేఘాల వల్ల ఆకస్మికంగా భారీ వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశం ఉంటుందని కూర్మనాథ్ తెలిపారు. వీటన్నిటిపై సమాచారం అందించేందుకు విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుందని.. ప్రజల ఫోన్లకు సందేశాలు పంపిస్తామని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa