మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత దూకుడు పెంచారు. ఢిల్లీలో ప్రెస్మీట్ నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేశారు.. తన తండ్రి హత్య కేసులో న్యాయం జరగాలని.. వచ్చే ఎన్నికల్లో ప్రజా తీర్పు ఇవ్వాలని కోరారు. అయితే తాజాగా సునీత మరో కీలక నిర్ణయం తీసుకోవవాలని భావిస్తున్నారట. సునీత త్వరలోనే రాజకీయ ప్రకటన చేయబోతున్నట్లు పులివెందులలో ప్రచారం జరుగుతోంది. తన తండ్రి ఐదో వర్ధంతి రోజైన ఈ నెల 15న ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి.. 15న కడపలో ఆత్మీయ సమావేశం పేరిట అభిమానులతో భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది.
రాజకీయంగా వేసే అడుగులపై కీలక ప్రకటన చేయాలని భావిస్తున్నారట. రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు, అందుకు గల కారణాలను కడప జిల్లా వాసులకు.. ప్రత్యేకించి పులివెందుల నియోజకవర్గ ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తోంది. తండ్రి వివేకా హత్య.. సీబీఐ దర్యాప్తు, కుట్ర కోణాలు, ఆ తర్వాతి పరిణామాలు, బాధితులైన తమపైనే పోలీసులు ఎదురు కేసులు పెట్టడాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. న్యాయ పోరాటం కొనసాగిస్తున్న సునీత.. రాజకీయంగా కూడా యాక్టివ్ కావాలని భావిస్తున్నారు.
మరోవైపు రెండు, మూడు రోజులుగా మరో సరికొత్త ప్రచారం మొదలైంది. ఎన్నికల్లో వివేకా భార్య సౌభాగ్యమ్మను కడప ఎంపీ లేదా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. వీటన్నింటినీ ఆత్మీయ సమావేశంలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం కోసం పులివెందులలోని విజయ గార్డెన్స్ను ఎంపిక చేసి ఈ నెల 15కి అద్దె సైతం చెల్లించారు. ఒప్పందం చేసుకున్నాక కొందరి ఒత్తిళ్లతో దాని నిర్వాహకులు ఆ రోజుకు ఫంక్షన్ హాలు ఖాళీ లేదని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆత్మీయ సమావేశాన్ని సునీత కడపకు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే సునీత ఆత్మీయ సమావేశంపై అధికారికంగా సమాచారం రావాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa