ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొత్తుల లెక్క దాదాపు తేలిపోయింది. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లు భేటీ అయ్యారు. ఎన్డీయే కూటమి 400కి పైగా సీట్లు టార్గెట్ పెట్టుకున్న బీజేపీ.. ఆ దిశగా మరో అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్లో సీట్ల సర్దుబాటుపై అమిత్షా, నడ్డాలు చంద్రబాబు, జనసేనానితో చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనకు 3 లోక్సభ, 24 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. మిగిలిన స్థానాలకూ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా.. బీజేపీకి కేటాయించే సీట్ల అంశంపైనే కసరత్తు జరిగింది.
బీజేపీకి 4 ఎంపీ సీట్లు, 6 వరకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని టీడీపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకు మించి ఇస్తే కూటమికి నష్టం జరుగుతుందన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. ఇక మిగిలింది కేవలం సీట్ల సర్దుబాటు అంటున్నారు.. శుక్రవారం మరోసారి సమావేశం కానున్నారు. టీడీపీ ఎన్డీఏలోకి చేరడం ఖాయమైందని.. సీట్ల లెక్కలు తేలితే అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. ఫిబ్రవరిలో 7న కూడా ఢిల్లీలో అమిత్షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు ఓ చర్చలు జరిపారు. తాజాగా మరోమారు చర్చల కోసం ఆయన హైదరాబాద్ నుంచి వెళ్లారు.
బీజేపీకి 2014 ఎన్నికల్లో4 ఎంపీ, 13 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఇప్పుడు ఆ పార్టీ 7 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కూటమిలో జనసేన కూడా ఉండటం, ఇప్పటికే ఆ పార్టీకి 3 లోక్సభ, 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించినందున బీజేపీ అడిగినన్ని సీట్లు సర్దుబాటు చేయడం సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా బీజేపీ, జనసేనలకు కలిపి 7 లోక్సభ, 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారట. చర్చల అనంతరం ఈ సంఖ్యలో కొంత అటూ ఇటూ మార్పు ఉండొచ్చని అంటున్నారు.
మరోవైపు అమిత్ షా, నడ్డాతో రాష్ట్ర బీజేపీ నేతలు కూడా సమావేశం అయ్యారు. ఏపీలో ఎన్నిసీట్లకు పోటీ చేయాలన్న విషయంపై చర్చించారు. విజయావకాశాలు ఉన్న సీట్ల గురించి స్పష్టమైన అంచనాకు రావాలని ఆదేశించారు. దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు గురువారం మరోసారి సమావేశమయ్యారు. శుక్రవారం కూడా ఢిల్లీలోనే ఉండాలని, చంద్రబాబు, పవన్తో చర్చల తర్వాత మళ్లీ పిలిపిస్తామని రాష్ట్ర నేతలకు పార్టీ పెద్దలు చెప్పినట్లు తెలుస్తోంది. పోటీ చేయబోయే స్థానాలపై స్పష్టత వచ్చిన వెంటనే అభ్యర్థుల పేర్లతో సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద ఒకటి రెండు రోజుల్లో బీజేపీతో పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa