వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచిస్తు్న్నారు. అందులో భాగంగా జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలపడం కోసం గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే జనసేనతో కలిసి 99 మందితో ఒక అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన చంద్రబాబు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను గురువారం ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా అవెల్లడించారు.
గురువారం టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేస్తామని విలేకర్లతో చిట్ చాట్ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ జాబితాలో కొంతమంది ఎంపీ అభ్యర్థుల పేర్లు సైతం ప్రకటిస్తామన్నారు. ఎంతమందిని వీలైతే అన్ని పేర్లు ప్రకటిస్తామని చెప్పారు. ఇక బీజేపీ, జనసేనకు సంబంధించి ఎక్కడ పోటీచేయాలనే విషయంలో ఆ రెండు పార్టీలు స్పష్టతతో ఉన్నాయని చంద్రబాబు అన్నారు. గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో కలలకు రెక్కలు కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే గురువారం రెండో జాబితా విడుదల చేసే విషయాన్ని వెల్లడించారు. అలాగే సీట్లు రాని నేతలకు పార్టీ న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. పొత్తులో భాగంగా కొన్నిసార్లు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందని. ఈ విషయాన్ని నేతలు అర్థం చేసుకోవాలని సూచించారు.
మరోవైపు టీడీపీ, జనసేన ఉమ్మడిగా ఇప్పటికే అభ్యర్థుల జాబితా విడుదల చేశాయి. మొత్తం 99 మందితో లిస్టు విడుదల చేయగా.. అందులో 94 మంది టీడీపీ, ఐదుగురు జనసేన అభ్యర్థులు ఉన్నారు. అయితే గురువారం 50 మంది అభ్యర్థులతో చంద్రబాబు రెండో జాబితా విడుదల చేస్తారని సమాచారం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సీట్ల కేటాయింపులో టీడీపీకి 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లు.. జనసేనకు 21 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లు, బీజేపీకి 10 అసెంబ్లీ, 6 ఎంపీ సీట్లు కేటాయించారు.
అయితే ఇప్పటికే 94 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన టీడీపీ.. ఇబ్బందులు లేని మరో 50 స్థానాలకు గురువారం అభ్యర్థులను ప్రకటిస్తారని తెలిసింది. ఇక తొలి జాబితాలో గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ చౌదరి సహా పలువురు సీనియర్ నేతల పేర్లు లేవు. మరి రెండో లిస్టులో అయినా వారి పేర్లు ఉంటాయా లేదా మరికొన్నాళ్లు వేచిచూడక తప్పదా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీడీపీ అధికారంలోకి వస్తే మహాశక్తి కింద మహిళల కోసం ఐదు కార్యక్రమాలు అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. తల్లికి వందనం పేరుతో ఏటా 15వేలు అందిస్తామని అన్నారు. కలలకు రెక్కలు కార్యక్రమం కింద ఉన్నత చదువులు చదివేందుకు విద్యార్థినులు బ్యాంకు రుణం పొందేలా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ఈ రుణాలకు ప్రభుత్వమే ష్యూరిటీ ఉంటుందన్న చంద్రబాబు.. వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa