ఏపీలో రైలు ప్రయాణికులకు అధికారులు గుడ్న్యూస్ చెప్పారు. రాష్ట్రం మీదుగా నడిచే మరికొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను మరికొన్ని స్టేషన్లలో ఆపాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల నుంచి వస్తున్న రిక్వెస్ట్లతో తాజాగా నిర్ణయం తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ఆగే పలు రైళ్లను కొవిడ్ సమయంలో రద్దు చేశారు. అప్పటి నుంచి ఆ రైళ్లు ఆ స్టేషన్లో ఆగడం లేదు.. మళ్లీ ఇంతకాలం తర్వాత శుభవార్త చెప్పారు. నేటి నుంచి పూరీ- తిరుపతి, బిలాస్పూర్-తిరుపతి ఎక్స్ప్రెస్లు కొవ్వూరులో ఆగనున్నట్లు తెలిపారు.
బుధవారం రాత్రి 10.05 గంటలకు తిరుపతి నుంచి పూరీ వెళ్లే రైలు కొవ్వూరులో ఆగుతుంది. పూరీ నుంచి తిరుపతి వెళ్లే రైలు గురువారం ఉదయం 9.02 గంటలకు ఆగనుంది. తిరుపతి- పూరీ రైలు (17480) సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాలు, పూరీ-తిరుపతి (17479) రైలు సోమ, బుధ, గురు, శుక్ర, ఆదివారాలు నడుస్తాయి. బిలాస్పూర్-తిరుపతి (17481) మంగళ, శనివారాలు, తిరుపతి-బిలాస్పూర్ (17482) ఆది, గురువారాల్లో తిరగనున్నాయి.
పూరీ- తిరుపతి రైళ్లు ఆగని రోజుల్లో బిలాస్పూర్ రైలు కొవ్వూరులో ఆగుతుంది. రైల్వే అధికారుల ఉత్తర్వుల ప్రకారం ఈ రెండు రైళ్లను ఎక్స్పరిమెంటల్ స్టాపేజిగా ఇస్తున్నట్లుగా తెలిపారు. ఒక నిర్దిష్ఠ కాల ప్రమాణంలో రైలు సమయపాలన, ఎక్కే ప్రయాణికులు, వచ్చే ఆదాయం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుంటుంది. ఈ మేరకు ఆశించినంతగా ఆదరణ ఉంటే రెగ్యులర్గా మారుస్తారు. అంతేకాదు ఇటీవల మరికొన్ని రైళ్లకు కొత్తగా హాల్ట్లు కూడా ఇచ్చారు. రాజమహేంద్రవరంలో రామేశ్వరం - భువనేశ్వర్ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ (20895/20896) ఆగుతుంది. అలాగే హౌరా - పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ రైలు (12867/12868) రాజమండ్రిలో హాల్ట్ ఇచ్చారు. అనంతపురంలో హుబ్లీ - మైసూరు హంపి ఎక్స్ప్రెస్ (16591/16592) రైలు ఆగుతుంది. సిరిపురంలో సికింద్రాబాద్ - రేపల్లె ఎక్స్ప్రెస్ (17645/17646) రైలుకు హాల్ట్ ఇచ్చారు. ఆయా ప్రాంతాల ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు రైల్వేశాఖ అధికారులు.. ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఇప్పటికే ఒక వందేభారత్ ఎక్స్ప్రెస్ పరుగులు పెడుతుండగా.. తాజాగా మరో రైలు కూడా పట్టాలెక్కింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అహ్మదాబాద్ నుంచి వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ - విశాఖపట్నం వందేభారత్ (20707).. ఉదయం 5.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.50కు విశాఖ చేరుకుంటుంది. ఈ రైలు ఉ.6.39 గంటలకు వరంగల్, 7.43కు ఖమ్మం, 9.05కు విజయవాడ, 11కు రాజమహేంద్రవరం, 11.43కు సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు (20708 ) తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం 2.35 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి సాయంత్రం 4.03కు సామర్లకోట, 4.38కు రాజమహేంద్రవరం, 6.40కు విజయవాడ, రాత్రి 8.03కు ఖమ్మం, 10.03కు వరంగల్, 11.20కు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa