గిద్దలూరులో టీడీపీ కార్యకర్త మూలయ్య, నంద్యాలలో ఇమామ్ హుస్సేన్ హత్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో రాజకీయ హింస, శాంతి భద్రతలపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే దృష్టి పెట్టాలని కోరారు. మరో 50 రోజుల్లో కుర్చీ దిగి ఇంటికి పోయే ముందు కూడా జగన్ హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. గిద్దలూరులో టీడీపీ కార్యకర్త మూలయ్య, నంద్యాలలో ఇమామ్ హుస్సేన్ హత్యలను అధినేత ఖండించారు. ఎన్నికల వేళ వైసీపీ మరింత రాజకీయ హింసకు దిగుతోందని అన్నారు. ఓటమి భయంతో తీవ్ర నైరాశ్యంలో ఉన్న వైసీపీ మూకలు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. ‘‘ప్రజాగళం’’ సభకు వచ్చారన్న కారణంతో గిద్దలూరు నియోజకవర్గం, గడికోటకు చెందిన మూలయ్యను గొడ్డళ్లతో నరికి దారుణంగా చంపేశారన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం, చాగలమర్రిలో ఇమామ్ హుస్సేన్ అనే 21 ఏళ్ల యువకుడిపై కత్తులతో దాడి చేసి బలి తీసుకున్నారని అన్నారు. మాచర్లలో టీడీపీ కార్యకర్త సురేష్ కారును తగలబెట్టారని తెలిపారు. ఈ మూడు ఘటనలపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ చీఫ్ డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa