ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో మరో మందిర్-మసీదు వివాదం.. అయోధ్య, జ్ఞానవాపి, షాహీ ఈద్గా తర్వాత భోజ్‌శాల

national |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2024, 10:19 PM

దేశంలో మరో మందిర్-మసీదు వివాదం కొనసాగుతోంది. ఇప్పటివరకు అయోధ్య-బాబ్రీ మసీదు, కాశీ విశ్వనాథ ఆలయం-జ్ఞానవాపి మసీదు, శ్రీ కృష్ణ జన్మస్థలం-షాహీ ఈద్గా దర్గా వివాదాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారగా.. తాజాగా భోజ్‌శాల-కమల్ మౌలా మసీద్ కాంప్లెక్స్ వివాదం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే భోజ్‌శాల కాంప్లెక్స్ ఆవరణలో ఏఎస్ఐ సర్వే ప్రారంభించింది. అయితే ప్రస్తుతం జరుపుతున్న పూజలు, నమాజ్‌లు యథావిధిగా జరుపుకోవచ్చని తెలిపింది.


మధ్యప్రదేశ్‌లోని థార్ జిల్లాలో ఈ భోజ్‌శాల-కమల్ మౌలా మసీద్ కాంప్లెక్స్ ఉండగా.. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు సర్వే మొదలుపెట్టారు. మధ్యప్రదేశ్‌లోని వివాదాస్పద భోజ్‌శాల-కమల్ మౌలా మసీద్ కాంప్లెక్స్‌లో శుక్రవారం నుంచి ఏఎస్ఐ అధికారులు సర్వే ప్రారంభించారు. 15 మందితో కూడిన ఏఎస్ఐ టీమ్.. సైంటిఫిక్ సర్వేను మొదలుపెట్టారు. ఈ భోజ్‌శాల-కమల్ మౌలా మసీద్ కాంప్లెక్స్‌ అక్కడి హిందూ ముస్లింల మధ్య వివాదానికి కేంద్ర బిందువు అయింది.


అయితే భోజ్‌శాల సరస్వతీ దేవీ ఆలయం అని హిందువులు వాదిస్తుండగా.. కానీ కమల్ మౌలా మసీద్ అని ముస్లింలు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలు మధ్యప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువురి పిటిషన్లను స్వీకరించి విచారణ జరిపిన మధ్యప్రదేశ్ హైకోర్టు.. ఆ భోజ్‌శాల-కమల్ మౌలా మసీద్ కాంప్లెక్స్‌లో సైంటిఫిక్ సర్వే చేపట్టాలని ఏఎస్ఐకి ఈ నెల 11 వ తేదీన ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే 6 వారాల్లో సర్వే చేపట్టి రిపోర్టును తమకు అందించాలని ఏఎస్ఐకి సూచించింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో ఏఎస్ఐ సర్వే మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ భోజ్‌శాల- కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్‌లో మంగళవారం రోజున హిందువులు పూజలు చేస్తుండగా.. శుక్రవారం రోజు ముస్లింలు నమాజ్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఏఎస్‌ఐ సర్వే కొనసాగుతుండటంతో పూజలు, నమాజ్‌లు జరుపుకోవచ్చని హిందువులు, ముస్లింలకు అధికారులు తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ వెల్లడించారు.


భోజ్‌శాల కాంప్లెక్స్ ఏఎస్ఐ పరిధిలో ఉండగా.. భోజ్‌శాలలో ప్రతీ మంగళవారం హిందువుల పూజలు.. ప్రతీ శుక్రవారం ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు 2003 ఏప్రిల్‌లో ఏఎస్ఐ అనుమతించింది. ఈ క్రమంలోనే ఏఎస్ఐ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 2022 మే నెలలో హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ సంస్థ మధ్యప్రదేశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. దీనిపై స్పందన తెలపాలని ఏఎస్‌ఐ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే భోజ్‌శాల కాంప్లె్క్స్‌లో సర్వే నిర్వహించాలని సూచించింది. భోజ్‌శాల కాంప్లెక్స్‌లో ఉన్న స్తంభాలపై సంస్కృత శ్లోకాలు కూడా రాసి ఉన్న విషయాన్ని హైకోర్టు గుర్తుచేసింది. భోజ్‌శాల కాంప్లెక్స్‌లో సరస్వతీ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ కోర్టును కోరింది. 1034 సంవత్సరంలో అప్పటి థార్ పాలకులు భోజ్‌శాలలో సరస్వతీ విగ్రహాన్ని స్థాపించారని.. అయితే ఆ విగ్రహాన్ని 1857లో బ్రిటీష్ వారు లండన్‌కు తీసుకెళ్లారని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa