ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖలో నటి సౌమ్యపై పోలీసులకు మరోసారి ఫిర్యాదు.. సీసీ ఫుటేజ్ బయటపెట్టాలని ఆమె సవాల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2024, 10:05 PM

విశాఖలో సంచలనంరేపిన సినీ నటి సౌమ్య చోరీ వ్యహారం మరో మలుపు తిరిగింది. తన ఇంట్లో దొంగతనం చేసి దొరికిపోయిన సౌమ్య తన కుమార్తెను సోషల్‌మీడియా ద్వారా వేధిస్తోందని రిటైర్డు పోస్టల్ ఉద్యోగి జనపాల ప్రసాద్‌బాబు విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నటి కిల్లంపల్లి సౌమ్య ఇన్‌స్టాగ్రాం ద్వారా తన కుమార్తె మోనిక దివ్యతో స్నేహం పెంచుకొని ఇంట్లోకి చొరబడి దఫదఫాలుగా 75 తులాల బంగారం చోరీ చేయడంతో ఇటీవల క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.


ఆమె చేసిన నేరం రుజువు కావడంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి కొంత బంగారం తమకు అందజేశారని తెలిపారు. బెయిల్‌పై బయటకు వచ్చిన ఆమె ఇప్పుడు సోషల్‌ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తూ తన కుమార్తెను వ్యక్తిగతంగా మానసిక వేదనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ఆమె చేష్టలతో సీనియర్‌ సిటిజనైన తాను కూడా మానసిక క్షోభ అనుభవిస్తున్నానని తెలిపారు. సౌమ్యపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


పెందుర్తికి చెందిన సౌమ్య యూట్యూబ్, ఇన్ స్టా వీడియో, షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లు చేస్తోంది. సౌమ్యకు రిటైర్డ్ ఉద్యోగి జనపాల ప్రసాద్ కుమార్తె మోనికతో గతంలో పరిచయం అయ్యింది. ఆమె కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావడంతో.. ఇద్దరు కలిసి కొన్ని వీడియోల్లో నటించారు. అయితే ఇద్దరికి వేర్వేరు సమయాల్లో వివాహాలు అయ్యాయి. సౌమ్యకు కూడా సుజాత నగర్‌లో ఉంటున్న ఒడిశాకు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. కాగా, మోనికకు పాప పుట్టడంతో.. ఆ చిన్నారి ఫోటోలను ఇన్ స్టా వేదికగా షేర్ చేసేది. ఈ ఏడాది జనవరిలో సౌమ్య, మోనికల మధ్య మళ్లీ మాటలు మొదలయ్యాయి.


అప్పుడప్పుడు సౌమ్య మోనిక ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో ఫిబ్రవరి 23న యలమంచిలిలోని బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో బీరువాలో ఉన్న బంగారం తీసి చూశారు మోనిక కుటుంబ సభ్యులు.. అవి కనిపించకపోవడంతో అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఏకంగా 74 తులాల బంగారం వరకు కనిపించడం లేదన్నారు. ఈ క్రమంలో సౌమ్య తీరుపై అనుమానం ఉందని చెప్పడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. సౌమ్యను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో సౌమ్య బెయిల్‌పై ఇటీవల విడుదలయ్యింది. మళ్లీ ఇప్పుడు సౌమ్యపై ప్రసాద్ ఫిర్యాదు చేశారు.


ఇదిలా ఉంటే సౌమ్య వాదన మరోలా ఉంది.. ప్రసాద్, మౌనికలు తనపై తప్పుడు ఆరోపణలు చేశారని.. తాను వారి ఇంటికి వెళ్లానని.. తాను ఇంటికి వచ్చి వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. నాలుగుసార్లు తనకు సెండాఫ్ ఇచ్చేందుకు కిందకు రాలేదా.. ప్రసాద్ వెనుక దాక్కుని మౌనిక డ్రామాలు చేస్తోందన్నారు సౌమ్య. తాను న్యాయపరంగా పోరాటం చేస్తానని.. తన నిజాయితీని నిరూపించుకుంటానన్నారు సౌమ్య.. ఇన్‌స్టాలో ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. మొత్తానికి ఈ దొంగతనం వ్యవహారం విశాఖలో చర్చనీయాంశమవుతోంది. ప్రసాద్ కుటుంబం సౌమ్యపై దొంగతనం ఆరోపణలు చేస్తుంటే.. సౌమ్య తాను తప్పు చేయలేదని చెబుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa