గురువారం సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన ఈడీ బృందం దాదాపు 2 నుంచి రెండున్నర గంటలపాటు సోదాలు నిర్వహించింది. అయితే ఈ సోదాల్లో వారు కీలక పత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు. అయితే కేజ్రీవాల్ నివాసంలో దాదాపు 150 పేజీల కీలక డాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అందులో ఈడీ అధికారులకు సంబంధించి కీలక సమాచారం ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ పత్రాలు చూసి ఈడీ అధికారులే షాక్ అయినట్లు సమాచారం. దీంతో అవి కేజ్రీవాల్ వద్దకు ఎలా వచ్చాయి. అందులో ఏం ఉంది అనేదే ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసంలో సీజ్ చేసిన 150 పేజీల డాక్యుమెంట్లలో ఈడీకి చెందిన ఇద్దరు ఉన్నతాధికారుల గురించి కీలక సమాచారం ఉందని తెలుస్తోంది. ఈడీ స్పెషల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ ర్యాంకు అధికారుల గురించిన విషయాలు ఉన్నాయని సమాచారం. అయితే భద్రతా కారణాల దృష్ట్యా వారి పేర్లు, వివరాలు, ఆ డాక్యుమెంట్లలోని సమాచారాన్ని ఈడీ అధికారులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు ఈడీ అధికారుల్లో ఒకరు ప్రస్తుతం కేజ్రీవాల్ నివాసంలో జరిపిన సోదాల్లో కూడా పాల్గొన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ పత్రాల్లో ఉన్న వివరాలను చూసి ఈడీ అధికారులే షాక్కు గురయ్యారని తెలిపాయి.
ఆ పత్రాలు గుర్తించిన వెంటనే ఈడీ అధికారులు వాటిని సీజ్ చేశారని సమాచారం. అనంతరం ఈ డాక్యుమెంట్ల వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈడీ అధికారుల వివరాలను కేజ్రీవాల్ ఎందుకు సేకరించారు.. దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అనే విషయాలపై ఆరా తీయనున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు గురించి దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులపై అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నిఘా పెట్టినట్లు ఈ పత్రాల ద్వారా తెలుస్తోందని సంబంధిత వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి.
ఇక శుక్రవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ను ఈడీ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 28 వ తేదీ వరకు కేజ్రీవాల్ను ఈడీ కస్టడీకి అప్పగించింది. అంతకుముందు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ.. ఈడీ తరఫున ఎస్వీ రాజు సుదీర్ఘ వాదనలు వినిపించారు. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాది కోరగా.. అసలు కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమమని.. ఆయనను విడుదల చేయాలని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వాదించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa