నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజకీయ భవిష్యత్ ఏంటి. బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ టికెట్ ఆశించినా దక్కలేదు.. దీంతో రఘురామ అడుగులు ఎటువైపు అనే చర్చ జరుగుతోంది. రెండు రోజులుగా ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సరికొత్తగా చర్చ జరుగుతోంది. రఘురామకు ఎన్నికల్లో పోటీచేసే అవకాశమివ్వాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన్ను ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఏదైనా అసెంబ్లీ స్థానంలో బరిలో దించాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
రఘురామను విజయనగరం లోక్సభ స్థానంలో టీడీపీ తరఫున పోటీచేయిస్తారనే చర్చ నడిచింది. కొందరు నేతలు ప్రతిపాదించగా.. ఉత్తరాంధ్ర నాయకులు అంగీకరించలేదని చెబుతున్నారు. తమ ప్రాంత సామాజిక సమీకరణలను చూస్తే.. సరైన నిర్ణయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చివరకు ప్రత్యామ్నాయంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైనా అసెంబ్లీ సీట్లో ఆయనను నిలపాలన్న ప్రతిపాదన తాజాగా తెరపైకి వచ్చింది. ఆ జిల్లాలో తమ కోటా కింద వచ్చిన అన్ని అసెంబ్లీ సీట్లకు టీడీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది. వారిలో ఎవరినైనా ఆపి రఘురామ రాజును నిలిపితే ఎలా ఉంటుందన్నదానిపై సమాచారం సేకరిస్తున్నారట. ప్రధానంగా ఉండి నియోజకవర్గం పేరు బాగా వినిపిస్తోంది.. కాకపోతే అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు. ప్రస్తుతానికి ప్రతిపాదనను మాత్రం తెరపైకి తెచ్చారని చెబుతున్నారు.
మరోవైపు నరసాపురం ఎంపీ రఘరామకృష్ణరాజు స్వతంత్ర అభ్యర్థిగాపోటీ చేసినా.. ఆయనకు అండగా ఉండి గెలిపిస్తామని కొందరు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ అప్రజాస్వామిక పాలనా విధానాలు, సీఎం జగన్పై ప్రాణాలొడ్డ్డి పోరాడిన ఏకైక నాయకుడు రఘురామ అన్నారు అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య. రఘురామకు ఎంపీ సీటు ఇవ్వడానికి కూటమిలోని మూడు పార్టీలకు ఎందుకు చేతులు రావడం లేదని ప్రశ్నించారు.
ఆయనకు సీటు ఇవ్వకపోవడాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని.. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఇంద్రధనస్సును మించిన రంగుల్లో కనిపిస్తున్నాయన్నారు. సీట్ల కేటాయింపులు కొంత గందరగోళంగా, నిరాశ నిస్పృహలతో ఉండటం చాలా మందిని బాధిస్తోందన్నారు. ఎన్ఆర్ఐలు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్లకు నిద్ర లేపి మరీ టికెట్లు ఇస్తున్నారని.. అసెంబ్లీలో అమరావతి జెండా ఉండాలని నినదిస్తే.. ఎవరూ పట్టించుకోలేదని, తనకు సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదన్నారు. మూడు విపక్ష పార్టీలు సమీక్షించుకుని రఘురామరాజుకు సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. మొత్తం మీద రఘురామ ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఆయనకు చివరికి టికెట్ దక్కుతుందా లేదా అనే సందిగ్థత ఉంది. మరి టీడీపీ అవకాశం ఇస్తుందా.. ఇస్తే ఎక్కడి నుంచి ఇస్తుంది.. దాదాపు అన్నిచోట్ల అభ్యర్థుల్ని ప్రకటించడంతో.. గందరగోళం కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa