మద్యం పాలసీలో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. అరెస్ట్ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సమయంలో ఆయన సతీమణి సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో.. ఢిల్లీ మద్యం కేసులో వాస్తవాలను తన భర్త మార్చి 28న కోర్టులో బయటపెడతారని అన్నారు. మనీ ల్యాండరింగ్కు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారని, ఆ సొమ్ము ఎక్కడ దాచిపెట్టారో కోర్టు ముందు ఉంచుతారని పేర్కొన్నారు. కస్టడీలో ఉన్నా ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారని, దీన్ని కూడా కేంద్రం జీర్ణించుకోలేకపోతుందని మండిపడ్డారు.
‘అక్రమ కేసులో నా భర్తను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు.. ఆయనకు ఆరోగ్యం సరిగా లేదు.. డయాబెటిస్తో బాధపడుతున్నారు. కస్టడీలోనూ ఆయన ప్రజల కోసమే ఆలోచిస్తున్నారు. అక్కడి నుంచే ఢిల్లీలో నీటి సమస్యను నివారించాలని రెండు రోజుల కిందట జలవనరుల మంత్రి ఆతిషికి నోట్ పంపారు. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సమస్యగా మారుస్తోంది.. ఆయనపై కేసులు బనాయిస్తోంది.. ఢిల్లీని నాశనం చేయాలని వారు (కేంద్రం) కోరుకుంటున్నట్టుంది. ఈ పరిణామాలతో ఆయన ఆందోళనకు గురవుతున్నారు’’ అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
‘మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటివరకు 250 సార్లకు పైగా సోదాలు జరిపింది.. ఇన్ని సందర్భాల్లో వారికి చిల్లిగవ్వ కూడా దొరకలేదు.. ఇదో తప్పుడు కేసని, దీనికి సంబంధించి రేపు (మార్చి 28) కోర్టులో అన్ని నిజాలు బయటపెడతానని అరవింద్ కేజ్రీవాల్ నాతో చెప్పారు.. మద్యం కుంభకోణంలో డబ్బు ఎక్కడుందో ఆయన న్యాయమూర్తి ముందు చెబుతారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా బయటపెడతారు.. ఆయన అక్రమంగా ఒక్క పైసా కూడా పొందలేదు’ అని కేజ్రీవాల్ భార్య వెల్లడించారు. కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడని, ధైర్యం గల నేత అని ఆమె తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa