సరిహద్దుల్లో చైనాకు చెక్ పెట్టే మరో వ్యూహాత్మక రహదారిని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) లడఖ్లో పూర్తి చేసింది. నిమ్ము-పదం-దార్చాలను కలుపుతూ 298 కి.మీ. పొడవైన రహదారి అందుబాటులోకి రానుంది. వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో మనాలీ-లేహ్, శ్రీనగర్-లేహ్ హైవే తర్వాత అందుబాటులోకి రానున్న మూడో రహదారి ఇది. బీఆర్ఓ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రఘు శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ‘జనవరిలో జంస్కార్ నది గడ్డకట్టడంతో మేము దీనిని అనుకూలంగా చేసుకున్నాం.. అదనపు అటాక్ పాయింట్లను ఏర్పాటు చేయడానికి ఆ నది వెంబడి పరికరాలు, సిబ్బందిని తరలించాం.. దీంతో పనుల పురోగతి పెరిగింది’ అని అన్నారు.
‘మేము ఇప్పుడు ఈ కీలక ప్రాంతంలో కనెక్టివిటీని ఏర్పాటు చేశాం.. త్వరలో బ్లాక్ టాపింగ్ పనులు ప్రారంభిస్తాం.. షింకున్ లా టన్నెల్ నిర్మాణం కూడా ప్రారంభం కావడంతో లడఖ్కు అన్ని వాతావరణ పరిస్థితుల్లో ప్రయాణించే మూడో వ్యూహాత్మక మార్గం అందుబాటులోకి వస్తుంది’ అని ఆయన చెప్పారు. భద్రతకు సంబంధించిన ప్రధాని అధ్యక్షుడిగా ఉన్న క్యాబినెట్ కమిటీ గతేడాది ఫిబ్రవరిలో సమావేశమై ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా హిమాచల్ ప్రదేశ్-లడఖ్ను కలిపేలా 16,556 అడుగుల ఎత్తులో రూ.1,681 కోట్లతో షింకున్ లా సొరంగ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ సొరంగ నిర్మాణానికి మరో రెండేళ్ల పడుతుంది.
ఇక, 298 కి.మీ. పొడవైన మూడో వ్యూహాత్మక రహదారి.. కార్గిల్ హైవేపై దార్చా-నిమ్ము మీదుగా మనాలి నుంచి లేహ్ వరకూ సాగుతుంది. ‘నిమ్ము-పదం-దర్చా రహదారి వ్యూహాత్మక ప్రాముఖ్యతను పొందింది.. ఇది ఇతర రెండు రహదారులతో పోలిస్తే చిన్నదిగా ఉండటమే కాకుండా షింకున్ లా కనుమను దాటుతుంది’ అని ఒక అధికారి చెప్పారు. ‘సొరంగం పైకి వచ్చిన తర్వాత, ఈ అక్షం ఆల్-వెదర్ కనెక్టివిటీని కూడా కలిగి ఉంటుంది... లడఖ్కు ఈ మూడో ప్రాంతం అనుసంధానం చేయడం వల్ల ఉత్తర సరిహద్దుల (చైనాతో) వెంబడి మన రక్షణ సంసిద్ధతకు మరింత బలం ఇస్తుంది’ అని అన్నారు.
నిర్ఖా లోయ తుది దశ పనుల్లో భాగంగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ రెండు వైపులా సమాంతరంగా రాళ్లను డ్రిల్ చేస్తూ.. బీఆర్వో సిబ్బంది నిరంతరాయంగా పనిచేశారు. ‘ప్రపంచంలోని అత్యంత సవాలుతో కూడిన భూభాగం, క్లిష్లమైన వాతావరణ పరిస్థితుల్లో బీఆర్వో సిబ్బంది అనేక ఏళ్ల కృషి, శ్రమ, అంకితభావం, పట్టుదల ఫలితంగా దేశం హోలీని జరుపుకుంటున్నప్పుడు చివరకు సోమవారం కనెక్టివిటీ పూర్తయ్యింది’ అని ఆ అధికారి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa