ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అంటే సవాల్తో కూడుకున్నది. క్షణాల్లో మారిపోయే వాతావరణ పరిస్థితులను తట్టుకుని ముందుకు సాగడం ఆషామాషీ కాదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కరుగుతున్న హిమానీనదాలు, మంచు తుఫాన్లు ఇలాంటి పరిస్థితిలో పెద్ద పెద్దవారే ఎవరెస్టు ఎక్కేందుకు వెనుకాడతారు. కానీ, ఓ రెండున్నరేళ్ల చిన్నారి సాహసానికి ఎవరెస్ట్ తలవంచింది. భోపాల్కు చెందిన సిద్ధి మిశ్రా అనే చిన్నారి ఎవరెస్టు శిఖరాన్ని చేరుకుని చరిత్ర సృష్టించింది. దీంతో అతిపిన్న వయస్సులోనే ఎవరెస్టు బేస్ క్యాంపునకు చేరిన భారతీయ చిన్నారిగా రికార్డు నెలకొల్పింది. బుడిబుడి అడుగులతో ఎవరెస్టును అధిరోహించిన ఆ చిన్నారి సాహసాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.
సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. ఎక్స్పెడిషన్ హిమాలయ కంపెనీ ఎండీ నబీన్ త్రితాల్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. భోపాల్కు చెందిన మహీం మిశ్రా, ఆయన భార్య భావన దేహరియాలు 2019 మేలో ఎవరెస్ట్ను అధిరోహించారు. ఆ దంపతుల కుమార్తే చిన్నారి సిద్ధి మిశ్రా. తల్లిదండ్రులతో కలిసి మార్చి 22న సిద్ధి మిశ్రా ఎవరెస్ట్ను అధిరోహించి అరుదైన ఘనతను సాధించింది. హిమాలయ పర్వతాల్లోని ఎవరెస్ట్ ఈశాన్య ప్రాంతంలో ఉన్న నేపాల్లోని లక్లా నుంచి మార్చి 12న ఈ కుటుంబం యాత్రను మొదలుపెట్టింది.
పది రోజుల్లో 53 కి.మీల దూరాన్ని పూర్తి చేసి తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. రెండున్నరేళ్ల తమ కుమార్తెతో కలిసి ఎవరెస్టును అధిరోహించడంపై భావన సంతోషం వ్యక్తి చేశారు. మధ్యప్రదేశ్ సర్కారు చేపట్టిన బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమానికి ఈ విజయాన్ని అనుసంధానం చేశారు. ‘రెండున్నరేళ్ల వయసులో ఎక్స్పెడిషన్ హిమాలయ సంస్థ సాయంతో ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు (ఈబీసీ) చేరుకున్న తొలి చిన్నారి సిద్ధి’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు .
ఈబీసీకి చేరుకోవడం అంత తేలికైన పని కాదని భావా దేహరియా అన్నారు. మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాకు చెందిన భావన.. చిన్నతనం నుంచి తన గ్రామం టామియా చుట్టూ ఉండే కొండలను అధిరోహించడం ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శిఖరాలను ఎక్కాలనే అభిరుచిని పెంచుకుంది.
‘ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అనిపించినంత సులభం కాదు.. కానీ గిన్ని (సిద్ధి) దానిని విజయవంతంగా పూర్తిచేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ గమ్యాన్ని చేరుకోవడానికి పూర్తి అభిరుచిని ప్రదర్శించింది’ అని వ్యాఖ్యానించారు. బేస్ క్యాంప్లోని అత్యంత ఆశ్చర్యకరమైన అంశాలలో ఒకటి కొత్త ల్యాండ్మార్క్ ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే ఫోటోలతో సందర్శకులను స్వాగతించే సైన్బోర్డ్ అని ఆమె అన్నారు. ఇది గ్రాఫిటీతో కప్పి ఉన్న బండరాయి. ఇది సంవత్సరాలుగా బేస్ క్యాంప్నకు అధికారిక రాకను సూచిస్తుంది.
అయితే, ఈ ఏడాది ప్రారంభంలో స్కాట్లాండ్కు చెందిన రెండేళ్ల చిన్నారి కూడా ఎవరెస్ట్ బేస్ క్యాంపును చేరుకుంది. ఈ చిన్నారిని ఆమె తండ్రి వీపుపై మోస్తూ పర్వతారోహణ చేశారు. అలాగే, గతేడాది అక్టోబర్ 25న బ్రిటన్కు చెందిన రెండేళ్ల బుడతడు టాట్ కార్టర్ ఎవరెస్ట్ శిఖరం ఎక్కి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన పర్వతారోహకునిగా నిలిచి అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నాడు. గతంలో చెక్ రిపబ్లిక్కు చెందిన నాలుగేళ్ల చిన్నారి సైతం ఎవరెస్ట్ బేస్ క్యాంపును చేరుకుని చరిత్రను తిరగరాసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa