ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 10:50 AM

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌పై  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్క అవకాశం అని అందరికీ ముద్దులు పెట్టి ఆ తర్వాత ప్రజలను ఇబ్బందికి గురిచేశారని మండిపడ్డారు. ఆ బాధ ఇప్పుడు ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని చంద్రబాబు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. మదనపల్లెలో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. వైసీపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ బీజేపీ జనసేన కూటమిని ప్రజలు ఆశీర్వదిస్తారని తెలిపారు. సీఎం జగన్ ప్రజలను నమ్మించి తడి గుడ్డతో గొంతు కోశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. గత ఐదేళ్లలో కలిగిన ఇబ్బందులను ప్రజలు మరవలేదని వివరించారు. ఇప్పుడు రాష్ట్రానికి చాలా కీలకమైన సమయం అని, ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఐదేళ్ల నరకాసుర పాలనకు చెక్ పెట్టే సమయం ఇది అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలేనని గుర్తుచేశారు. గత ఐదేళ్లలో కొందరు వాలంటీర్ల చర్యలు, కరెంట్ కోతలు, వైసీపీ కార్యకర్తల దాడులతో జనం భయాందోళనకు గురయ్యారని చంద్రబాబు తెలిపారు. జగన్ పాలనకు చరమగీతం పాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa