ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భీమిలి నుండి బరిలోకి దిగనున్న గంటా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 30, 2024, 12:27 PM

మాజీ మంత్రి, సీనియర్‌ నాయకులు గంటా శ్రీనివాసరావు ఈసారి భీమిలి నుంచి పోటీ చేయనున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని టీడీపీ అధిష్ఠానం శుక్రవారం ఖరారుచేసింది. గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు రానున్న ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేయాలని భావించారు. ఆ మేరకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కలిసి, అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే ఈసారి విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని చంద్రబాబునాయుడు సూచించారు. అక్కడ విజయం సాధిస్తే మంచి పేరు వస్తుందని వెళ్లాలని ఆదేశించారు. అయితే చీపురుపల్లి తనకు దూరం అవుతుందని, వెళ్లి రావడం ఇబ్బందిగా ఉంటుందని గంటా తన మనసులో మాట వెల్లడించారు. గంటాను చీపురుపల్లి వెళ్లాల్సిందిగా సూచించిన అధిష్ఠానం భీమిలి నియోజకవర్గానికి పలువురి పేర్లను పరిశీలనలోకి తీసుకుంది. పార్టీ ఇన్‌చార్జి కోరాడ రాజాబాబు, నెల్లిమర్ల పార్టీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు పేర్లను తొలుత పరిశీలించింది. ఆ తరువాత బైరా ఫౌండేషన్‌ చైర్మన్‌ దిలీప్‌ చక్రవర్తి పేరును కూడా జాబితాలో చేర్చింది. ఈ ముగ్గురిలో ఒకరికి భీమిలి టిక్కెట్‌ ఇవ్వాలని భావించింది. అయితే గంటా శ్రీనివాసరావు చివరి వరకు చేసిన ప్రయత్నాలు, భీమిలిలో సీనియర్‌ నాయకులే బరిలో ఉండాలని పార్టీ అధినేత భావించడంతో గంటా పేరునే ఖరారు చేశారు. తనకు టికెట్‌ కేటాయించినందుకు చంద్రబాబునాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గంటా పేరును ప్రకటించగానే భీమిలిలో పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి హర్షాతికేరాలు వ్యక్తంచేశాయి. కూటమిలోని జనసేన, బీజేపీ నాయకులు ఆయన్ను కలిసి అభినందనలు తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa