ఇచ్ఛాపురం నుంచి మంత్రాలయం వరకు ఎన్టీయే తుఫాన్ రానుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దీని దెబ్బకు ఫ్యాన్ రెక్కలు విరిగి చెత్తబుట్టలో చేరడం ఖాయమని స్పష్టం చేశారు. సీఎం జగన్ నోరుతెరిస్తే అబద్ధాలేనని.. గత ఐదేళ్లలో అరాచక పాలన సాగించారని ధ్వజమెత్తారు. అందరం కలిసి ఆయన్ను తరిమికొట్టి రాష్ట్రాన్ని బాగుచేసుకుందామని పిలుపిచ్చారు. ప్రజాగళంలో భాగంగా శుక్రవారం నంద్యాల జిల్లా బనగానపల్లె, నెల్లూరు జిల్లా కావలి, వింజమూరు (ఉదయగిరి నియోజకవర్గం) బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ ఆ పార్టీ తెలుగుజాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన తీరును.. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం నష్టపోయిన వైనాన్ని వివరించారు. రాష్ట్ర ప్రజలంతా ఈయన్ను ఇంటికి పంపించేయాలని నిర్ణయించుకున్నారని.. ఎన్డీయేకి జై కొడుతున్నారని చెప్పారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు జరిగిన నష్టాన్ని, కష్టాన్ని, అన్యాయాలను గుర్తు చేయడం కోసమే ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి వచ్చానని అన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో రైతులు బాగున్నారా, సబ్సిడీలు అందాయా, సాగునీరు అందిందా, గిట్టుబాటు ధర లభించిందా అనే విషయాలను రైతులు గుర్తు చేసుకోవాలన్నారు. ప్రజలకు తాగడానికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేని దద్దమ్మ పాలనను చూశామని దుయ్యబట్టారు. ఈ దుర్మార్గుడు రూ.10 ఇచ్చి 100 రూపాయలు లాక్కొని ప్రజల రక్తం తాగేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రాన్ని రూ.12 లక్షల కోట్ల అప్పుల పాల్జేశాడని.. వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేశాడని అన్నారు. అక్రమ కేసులతో వేధిస్తున్న సైకో పోవాలని.. ప్రజలు గెలవాలని.. భవిష్యత్ బంగారుమయం కావాలని.. రాష్ట్రం నిలబడాలని ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa