ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ పాలనలో సామాన్యుడు ఎంతగానో నలిగిపోయాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 30, 2024, 12:32 PM

వైసీపీ పాలనలో గత నాలుగేళ్ల కాలంలో అవినీతిపై 8,03,612 ఫిర్యాదులు వచ్చాయని జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై 4,39,679 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. కానీ తమ పాలనలో ఒక్క రూపాయి అవినీతీ జరగలేదని, అద్భుతమైన పాలన అందించామని సీఎం జగన్‌ తనకు తాను సర్టిఫై చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఇది హాస్యాస్పదమని నాదెండ్ల ఎద్దేవా చేశారు. శుక్రవారం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో సామాన్యుడు ఎలా నలిగిపోయాడో, అవినీతి ఎంతలా తాండవం చేసిందో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని అన్నారు. ఈ ముఖ్యమంత్రి 14400 అనే నెంబర్‌కి ఫోన్‌ చేసి అవినీతిపై ఫిర్యాదు చేయమంటే.. ఆ నెంబర్‌కి గత నాలుగేళ్లలో 8,03,612 ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై 4,39,679 ఫిర్యాదులు అందాయన్నారు. తమ పాలనలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని సెల్ఫ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చుకున్న జగన్‌ దీనికి ఏం సమాధానం చెబుతారని నాదెండ్ల మనోహర్‌ నిలదీశారు. సీఎం జగన్‌, ఆయన క్యాబినెట్‌ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై పత్రికలు పుంఖాను పుంఖాలుగా కథనాలు వచ్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రివ్యూ మీటింగ్‌లో ఏసీబీ డీజీ ఎవరు అని ముఖ్యమంత్రి అడిగారంటే, పరిపాలనపై జగన్‌కు ఎంత శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి తాండవం చేస్తోందని ఆరోపించారు. టీచర్ల బదిలీల్లో రూ.వందల కోట్ల అవినీతి జరిగిందని, ఒక మంత్రి అయితే ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి రూ.100 కోట్ల ఆఫర్‌ ఇచ్చారని నాదెండ్ల తెలిపారు. తాను చెప్పింది చేయాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఒక ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ తన సొంతూరికి బదిలీ చేయాలని అడిగితే మంత్రి రూ.10 లక్షలు తీసుకున్నారని, మరో ఇంజనీర్‌ దగ్గర రూ.15 లక్షలు తీసుకుని అతడిని బదిలీ చేశారని తెలిపారు. ఇలా మంత్రులు భారీ అవినీతికి పాల్పడుతున్నారన్నారని ఆరోపించారు. పోలీస్‌ బాస్‌గా ఉన్న డీజీపీనే ఏసీబీ డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. లక్షల ఫిర్యాదులు వస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, ఎవరి ఒత్తిడి మేరకు తొక్కి పెట్టారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa