తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీలో అసమ్మతి సెగలు చల్లారలేదు. తొలి జాబితాలో టీడీపీ, జనసేన అనపర్తి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించారు. అయితే పొత్తు నేపథ్యంలో బీజేపీకి ఆ సీటును కేటాయించారు. ఈ నేపథ్యంలో అనపర్తి సీటు రామకృష్ణారెడ్డికే కేటాయించాలని కార్యకర్తలు పట్టుబడుతున్నారు. నల్లమిల్లితో చంద్రబాబు ఫోన్లో మాట్లాడినా మంటలు చల్లారలేదు. సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, సుజయ్ కృష్ణ రంగారావు, గన్ని కృష్ణ శుక్రవారం నల్లమిల్లి నివాసానికి వెళ్లారు. రామకృష్ణారెడ్డి తల్లి సత్యవతి మాట్లాడుతూ.. తమను నమ్మించి మోసంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 42ఏళ్లుగా పార్టీని నమ్ముకుని అన్నిరకాలుగా ఇబ్బందులు పడుతూ పార్టీ పటిష్టతకు కృషి చేసిన తమ కుటుంబానికి ఇలా చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. విజయవాడ వచ్చి అధినేతతో మాట్లాడాలని నేతల బృందం నల్లమిల్లికి సూచించారు. అయితే తాను ఇప్పటికే ప్రజాభిప్రాయం కోసం ఐదు రోజుల పాటు కుటుంబంతో కలిసి పర్యటిస్తానని మాటిచ్చానని, తాను ప్రస్తుతం అధినేతను కలవలేనంటూ వారి ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa