ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కూటీపై అనుమానంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి చెక్ చేస్తే.. వామ్మో కట్టలు కట్టలుగా నోట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 02, 2024, 07:44 PM

ఎన్నికల వేళ ఏపీలో భారీగా నగదు పట్టుబడుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మురం చేశారు.ఈ క్రమంలోనే సరైన ధ్రువపత్రాలు లేకుండా నగదును సరఫరా చేస్తూ పోలీసుల తనిఖీల్లో పలువురు పట్టుబడుతున్నారు. తాజాగా విశాఖపట్నంలో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ పట్నంలోని ద్వారకానగర్ వద్ద భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో డబ్బులు తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో స్కూటీలో తరలిస్తున్న సుమారు కోటి రూపాయల నగదును పోలీసులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు స్కూటీలో నగదు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.


అయితే నగదుకు సంబంధించి వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో పోలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ తరలించారు. మరోవైపు స్కూటీలో ఇంత మొత్తం తరలిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వార్త స్థానికంగా సంచలనం రేపింది.


మరోవైపు అనంతపురం జిల్లాలో ఆదివారం కోటీ 70 లక్షల రూపాయలు తనిఖీల్లో దొరికింది. బస్టాండు కూడలి సమీపంలో పోలీసులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఖాజీ మస్తాన్‌వలి అనే వ్యక్తితోపాటు, మరో ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో వారి దగ్గర ఉన్న బ్యాగుల్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో రూ.1.70 కోట్లను పోలీసులు గుర్తించారు. నగదుకు సంబంధించిన ఆధారాలు లేకపోవటంతో వారిపై కేసు నమోదు చేసి నగదు మొత్తాన్ని ఐటీశాఖ అధికారులకు అప్పగించారు.


మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రూ.50 వేలకు మించి నగదుతో ప్రయాణాలు చేయకూడదని పోలీసులు సూచిస్తున్నారు. ఒక వేళ ప్రయాణించాల్సి వస్తే అందుకు తగిన పత్రాలను తమ వెంట ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకూ ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa